వైరస్ పట్ల ప్రజల్లో అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యం జతకలిసి దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృభించటానికి కారణమైంది. ఇది అనేక రాష్ర్టాల్లో లాక్డౌన్ తిరిగి ప్రారంభించటానికి దారితీసింది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్య వ్యవస్థపై చాలా ఒత్తిడి ఉంటుంది. అదే సమయంలో లాక్డౌన్ కారణంగా రోగులు ఆరోగ్య ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో రోగులందరికీ ‘టెలిమెడిసిన్’ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. దీన్ని ఎయిమ్స్ అందిస్తున్నది. ఇంట్లో కూర్చొని రోగి వాట్సాప్ నంబర్ లేదా ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్తో అవసరమైన వైద్య, చికిత్సా సాయం పొందవచ్చు. టెలిమెడిసిన్ వ్యవస్థ ఎయిమ్స్కు మాత్రమే పరిమితం కాదు, ఇది అన్ని చిన్న దవాఖానలకు కూడా విస్తరిస్తున్నది. తద్వారా ప్రజలకు ఇంట్లోనే ఉపశమనం లభిస్తుంది.
ప్రస్తుతం వైరస్ వేగంగా వృద్ధి చెందడం వల్ల రోగుల సంఖ్య బాగా పెరుగుతున్నది. కానీ దేశంలో వైద్యుల సంఖ్య పరిమితంగానే ఉంది. ఇలాంటి పరిస్థితిలో టెలిమెడిసిన్ సమర్థవంతమైన పరిష్కారంగా కనిపిస్తున్నది. దీన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలి. భారతదేశ జనాభా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం.. దేశంలో 4.5 లక్షల మంది వైద్యుల అవసరం ఉన్నది. కాబట్టి టెలిమెడిసిన్ పరిష్కారంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం, నేషనల్ టెలిమెడిసిన్ సర్వీస్ 31రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతా ల్లో పనిచేస్తున్నది. అత్యవసర చికిత్స, చికిత్స నాణ్యతలో రాజీ పడకుండా కరోనా బారిన పడే ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకోవడానికి టెలిమెడిసిన్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలా దేశాల్లో ఇప్పుడు టెలిమెడిసిన్ చికిత్సా పద్ధతిని అనుసరిస్తున్నారు.
భారతదేశం ప్రస్తుతం టెలిమెడిసిన్ రంగంలో మొదటి పది స్థానాల్లో ఉన్నది. ఒక నివేదిక ప్రకారం, 2025 నాటికి టెలిమెడిసిన్ పరిశ్రమ 405 బిలియన్లకు చేరుకుంటుంది. డిజిటల్ ఇండియా వల్ల ప్రజలు ఆన్లైన్ వైద్యసాయం, ఆన్లైన్ మెడికల్ బిల్లులు చెల్లించేవిధంగా గ్రామాలను బ్రాడ్బ్యాండ్ కనెక్షన్తో అనుసంధానించడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్య సదుపాయాల లభ్యతలో ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశం 145 స్థానంలో ఉన్నది. కానీ టెలిమెడిసిన్ రంగంలో మన దేశం ఎంత వేగంతో ముందుకుపోతున్నది. ఇది ఆరోగ్య రంగాలతో పాటు కరోనా నుంచి ప్రజలను కాపాడుతుంది. టెలిమెడిసిన్ విధానంతో దవాఖానలో చేరే రోగుల సంఖ్యను తగ్గించవచ్చు. దీనివల్ల సమయం వృథా కాదు, డబ్బు కూడా ఆదా అవుతుంది.
ఒక అంచనా ప్రకారం, టెలిమెడిసిన్ ఆరోగ్య సౌకర్యాలు మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ- హెల్త్ అనగా టెలిమెడిసిన్ విపత్తు సమయంలో వైద్య సదుపాయాలకు కూడా అంతరాయం కలిగించదు. అందువల్ల టెలిమెడిసిన్ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక పాత్ర పోషిస్తున్నది. టెలిమెడిసిన్లో కొన్ని సమస్యలూ ఉన్నాయి. ఒకటి, టెలిమెడిసిన్ పరిణామాల గురించి రోగుల్లో విశ్వాసం లేకపోవడం. రెండవది, ఆరోగ్య కార్యకర్తకు ఇప్పటికీ ఈ-మెడిసిన్ గురించి అవగాహన లేదు. మూడవది, దేశ జనాభాలో నలభై శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ తరగతి వారిలో సాంకేతిక అసమర్థత స్పష్టంగా కనిపిస్తుంది. నాల్గవది, దేశంలో నేటికీ గ్రామాల్లో ఇంటర్నెట్ లభ్యత లేదు. వైద్య సిబ్బందికి ఈ-మెడిసిన్ గురించి విస్తృతమైన శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. దీనితో పాటు పేద, గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ఆన్లైన్ కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంటుంది. దీనివల్ల పేదలు, రైతులు టెలి-ట్రీట్మెంట్ పొందవచ్చు. అందువల్ల, ఈ-హెల్త్ వ్యవస్థపై ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం. ఈ రోజు ప్రతి వ్యక్తి టెలిమెడిసిన్ గురించి మరింతగా తెలుసుకొని దవాఖానకు వెళ్లే బదులు ఇంట్లో ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా అవసరమైన వైద్య, చికిత్స పొందాల్సిన అవసరం ఉన్నది.
లాల్జీ జైస్వాల్