రేపటి నుంచి వారం రోజులు బ్రహ్మోత్సవాలు
వేడుకలకు ఆలయం ముస్తాబు
26న స్వామి వారి కల్యాణం
భక్తులకు అనుమతి లేదు : ఈవో
దిలావర్పూర్, మే 23: చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రనారసింహుడు శాంతమూర్తిగా కొలువైన క్షేత్రం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో కాల్వ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం. కోరిన కోర్కెలు తీర్చే కాల్వ నరసింహుడుగా ప్రసిద్ధి. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. పొడవాటి కోరమీసాలతో, నిప్పులు కురిపించె కళ్లతో నరమృగ శరీరంతో స్తంభంలోంచి ఉద్భవిస్తాడు నరసింహస్వామి. ఇక్కడి ఆలయం వద్ద కోనేరులోని నీరు రుతువులు మారినట్లుగా ఆరు రంగులుగా మారుతుందని, ఈ కోనేరులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి నుంచి నరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. పౌర్ణమి రోజు స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు.
ఆలయానికి ఇలా చేరుకోవచ్చు..
నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నిర్మల్ నుంచి భైంసాకు వెళ్లే దారిలో సిర్గాపూర్, న్యూలోలం గ్రామాల మీదుగా ప్రయణించి ఆలయానికి చేరుకోవచ్చు. స్వామి కల్యాణం రోజున నిర్మల్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు.
రేపటి నుంచి కార్యక్రమాలు..
కాల్వ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25న ప్రారంభమై వచ్చే నెల ఒకటో తేదీన ముగిస్తాయి. మొదటి రోజు ఉదయం అఖండ దీపార్చన, నరసింహ స్వామి జయంతి అంకురార్పణ, హవనం, మంత్రపుష్పం, 26న ఉదయం అగ్ని, ధ్వజారోహణం, బలిహరణం, గరుడ ముద్దల పంపిణీ, అనంతరం స్వామి వారి కల్యాణం, 27న కుంకుమపూజలు, శుక్రవారం భేరిపూజ హవనం, శనివారం నివేదనలు, ఆదివారం శేషహోమం, హవనం, సోమవారం స్వామి వారికి నాగవెల్లి, భూతబలి, ఉద్వాసన బలి, ఏకాంతోత్సవం, మంగళవారం రథోత్సవం, తదితర కార్యక్రమాలు ఉంటాయి. చక్రపాణి నరసింహమూర్తి, వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయి.
భక్తులకు అనుమతి లేదు
కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వద్ద నిర్వహించే బ్రహ్మోత్సవాలకు, స్వామి వారి కల్యాణానికి భక్తులకు అనుమతి లేదు. బ్రహ్మోత్సవాలు పూర్తిగా పండితుల అధ్వర్యంలోనే ఉంటాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులు రావద్దు. స్వామి వారి కల్యాణం నిరాడంబరంగా నిర్వహిస్తాం.
-ఈవో సదయ్య