ఉమ్మడి జిల్లాలో పక్కాగా లాక్డౌన్ అమలు
ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ
రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తాం
రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్
రామాయంపేట, మే 22 : ఉదయం ఆరు నుంచి పది గంటల వరకే అనుమతి. పది గంటలు దాటితే ఎవ్వరూ బయటకు వచ్చినా వాహనంతో పాటు జరిమానాలు విధిస్తామని సీఐ నాగార్జునగౌడ్ అన్నారు. శనివారం రామాయంపేట పట్టణంలోని మెదక్ చౌరస్తా, పాత జాతీ య రహదారిపై పోలీసులు పహారా కాశారు. అనంతరం సీఐ నాగార్జునగౌడ్ విలేకరులతో మాట్లాడారు. వాహనదారులు అనుమతి లేకుండా రోడ్లవెంట తిరిగితే కఠిన చర్యలు తీసుకోవడమే గాకుండా కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష
నర్సాపూర్/కొల్చారం, మే 22 : కరోనా మహమ్మారి నుంచి ప్రతిఒక్కరూ రక్షించుకోవాలంటే స్వీయ నియంత్రణ పాటించాలని కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్ సూచించారు. శనివారం మండల కేంద్రమైన కొల్చారంలో మామిడిటెంక తయారు చేస్తున్న మహిళలకు కరోనాపై అవగాహన కల్పించారు. అనంతరం లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.
గ్రామాల్లో మరోసారి ఇంటింటా సర్వే
చిలిపిచెడ్, మే 22 : గ్రామాల్లో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకే ప్రభుత్వం మరోసారి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నదని సర్పంచ్ పరశురాంరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామంలో వైద్య సిబ్బందితో కలిసి సర్పంచ్ ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించారు. ఎంపీటీసీ మల్లయ్య, వైద్య సిబ్బంది, ఆశ వర్క ర్స్ పాల్గొన్నారు.
నర్సాపూర్లో లాక్డౌన్ కట్టుదిట్టం
నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా కొనసాగింది. శనివారం నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్, కొల్చారం, కౌడిపల్లి, వెల్దుర్తి, చిలిపిచెడ్, మాసాయిపేట్ మండలాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నర్సాపూర్ మండలంలో సీఐ లింగేశ్వర్, ఎస్సై గంగరాజు, వెల్దుర్తి మండలంలో ఎస్సై మహేందర్ వాహనాలను తనిఖీ చేశారు.
ఎక్కడికక్కడ కట్టడి
10 గంటల్లోపు అన్ని బంద్ – రూల్స్ ఉల్లంఘిస్తే కేసులు
మెదక్, మే 22 : మెదక్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలలోపే ప్రజలు రోడ్లపైకి వచ్చి వారికి కావాల్సిన సరుకులను తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత అనవసరంగా, కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రజలు రోడ్లపైకి రావా లంటేనే భయపడేలా పోలీసులు చర్యలు తీసుకుంటు న్నారు. జిల్లాకేంద్రం మెదక్ పట్టణంతోపాటు ఆయా మండ లాల పరిధిలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పనులు పూర్తి చేసుకోవాల్సి రావడంతో చాలా మంది ఆ తర్వాత కూడా రోడ్లపైకి వస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఒక్కసారిగా వ్యాపార వాణిజ్య సముదాయాల్లో కిటకిటలాడుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 8 గంటల తర్వాత ట్రాఫిక్ ఎక్కువవుతోంది.
కఠినంగా లాక్డౌన్ అమలు
సిద్దిపేట టౌన్, మే 22 : కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పోలీసు శాఖ కఠినంగా అమలు పరుస్తున్నది. లాక్డౌన్ పటిష్ట అమలుకు సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ స్వయంగా శనివారం వాహనాల తనిఖీల్లో పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్ చేశారు. మరికొంత మంది యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పక్కాగా లాక్డౌన్ అమలుపర్చాలని, బందోబస్తు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని చెప్పారు. మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, కరోనా వ్యాధి నివారణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర పనిపై వచ్చే వారికి ఇప్పటి వరకు ఆన్లైన్ ఈ పాసు ద్వారా 2101 పాసులను అందించామని తెలిపారు. లాక్డౌన్, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1871 ఈ పెట్టి కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు 136 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. బందోబస్తును అడిషినల్ డీసీపీ శ్రీనివాసులు, ఏసీపీలు రామేశ్వర్, నారాయణ, మహేందర్ పర్యవేక్షిస్తున్నారన్నారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలోని ప్రధాన చౌరస్తాలను సందర్శించి లాక్డౌన్ తీరు పర్యవేక్షించారు.
గూడ్స్ వాహనదారులకు మార్గదర్శకాలు..
సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో కరోనా వ్యాప్తి నివారించడానికి లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ మాట్లాడారు. సిటీ పోలీసు యాక్టు ప్రకారం ఆదివారం నుంచి గూడ్స్ వాహనాల లోడింగ్, అన్లోడ్ కోసం రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు గూడ్స్ వాహనాల లోడింగ్, అన్లోడ్లకు అనుమతి ఉండదన్నారు. అదేవిధంగా ఆక్సిజన్ డెమోస్టిక్, గ్యాస్ సిలిండర్, క్యారింగ్ వెహికిల్స్, ఆక్సిజన్ ట్యాంకర్, మెడికల్ ఎక్రిట్మెంట్స్ వెహికిల్స్, వాటర్ సైప్లె చేసే వాహనాలు, రైతుల ధాన్యం నింపుకొని వచ్చే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు విధించడం లేదన్నారు. లాక్డౌన్ సమయంలో కూడా యథావిధిగా నడుస్తాయని తెలిపారు.