హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ వర్సిటీల వైస్ ఛాన్స్లర్స్ (వీసీల) నియామకంపై నేడు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. వీసీల నియామకంపై ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు చొప్పున పేర్లను ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం దస్త్రాన్ని తయారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. శుక్రవారం ఈ దస్త్రానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేశారు.
దీంతో ఇవాళ విద్యాశాఖ వీసీల నియామక ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు తెలిసింది. విద్యాశాఖ ఉత్తర్వులిచ్చిన వెంటనే రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, అంబేద్కర్, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయం వర్సిటీలకు కొత్త వీసీలు రానున్నారు. 2019 జూన్ నుంచి వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.