సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ పరిస్థితులు ప్రతి ఒక్కరినీ భయంలోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో చాలా మంది కరోనాకు సంబంధించి అనేక అనుమానాలు, సందేహాలు తీరక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు ఒత్తిడితో సతమతమవుతున్నారు. కొవిడ్తో బాధపడేవారు ఒంటరిగా ఇంట్లో ఉంటూ భయబ్రాంతులకు గురవుతున్నారు. మానసికంగా కుంగిపోతూ వ్యాధిని మరింత జఠిలం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో దైర్యం నింపి.. బతుకుపై భరోసా నింపుతున్నారు తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ సభ్యులు. అందుకోసం ఉచితంగా కౌన్సెలింగ్ అందిస్తూ కొవిడ్ బాధితుల్లో ఆత్మస్తైర్యం నింపుతున్నారు. కరోనా వైరస్ను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 210 మంది మానసిక సమస్యలను అధిగమించేలా చేశారు.
కరోనా బారిన పడి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు తీవ్ర మానసిక ఆందోళనతో ఉంటున్నారు. తాము కూడా చనిపోతామో ఏమో అనే అనుమానం వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు. అలాంటి వారికి మేం కౌన్సెలింగ్ చేసి సాధారణ జీవితం గడిపేలా చేశాం. చాలా మంది కరోనా వైరస్ భయానికి సరైన నిద్దుర, ఆహారం తీసుకోవడం లేదు. ఫలితంగా అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. కరోనాను ఎదుర్కోవాలంటే ధైర్యమే ఆయుధం. డాక్టర్ మోత్కూరి రామచంద్ర, కౌన్సెలింగ్ సైకాలజిస్టు
‘అతడి పేరు రమేశ్. సికింద్రాబాద్లో నివాసముంటూ ఓ ప్రైవేటు కంపెనీలు పనిచేస్తున్నాడు. ఇటీవలే రమేశ్ తల్లిదండ్రులకు కరోనా వచ్చింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. అతడికీ ఆ వ్యాధి సోకింది. దీంతో రమేశ్ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. సరిగ్గా అన్నం తినడం కూడా మానేశాడు. రోజురోజుకు అతని పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది. దవాఖానకు వెళ్లేందుకు కూడా నిరాకరించాడు. ఈ సమయంలోనే తెలిసిన వారి సూచనతో ఓ సైకాలజిస్టును సంప్రదించారు. ఫోన్ ద్వారా సదరు నిపుణుడు రమేశ్ భయాలన్నీ పోగొట్టారు. కొంచెం ధైర్యం తెచ్చుకుంటే కరోనాను ఎంత సులువుగా జయించొచ్చో తెలియజెప్పారు. సదరు సైకాలజిస్టు భరోసాతో 10 రోజుల్లోనే రమేశ్ పూర్తిగా కోలుకున్నాడు. కొవిడ్ను జయించిన తర్వాత ఎప్పటిలా ఉద్యోగం చేసుకోవడమే కాదు.. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇతరులకూ చెబుతున్నాడు.’
చిరాకు, నిద్ర, గందరగోళం, నిరాశ, ఒంటరితనం, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వారికి కౌన్సెలింగ్ చేసి పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేస్తున్నాం. అదే పనిగా కరోనా వార్తలను చూడొద్దు. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలి. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయాలి. ఆత్మీయులతో మాట్లాడాలి. యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ఒత్తిడినుంచి ఉపశమనం దొరుకుతుంది. మన ప్రతి ఆలోచన, భావోద్వేగం శరీరంలో ప్రతి కణం మీద ఏదో విధంగా ప్రభావం చూపుతుంది. – డాక్టర్ లక్ష్మీ, కౌన్సెలింగ్ సైకాలజిస్టు
కొంతమంది కరోనా నుంచి కోలుకున్నప్పటికీ తమ ఇంట్లో వారికి కూడా కొవిడ్ వస్తుందేమనని భయపడుతున్నారు. నెగెటివ్ ఆలోచనలతో వారిలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. కరోనా పరిస్థితులు మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇటువంటి భయాలతోనే చాలా కాల్స్ వస్తున్నాయి. వారిలో ధైర్యం నింపి భయాందోళనలను దూరం చేస్తున్నాం. భయం పోగొట్టుకుంటే కరోనాకు చెక్పెట్టినట్లే. మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అతి ముఖ్యం. మనసుపై ఒత్తిడి పెంచే ఆలోచనలు, భావోద్వేగాలను వదిలించుకోవాలి. -ఎం. కృష్ణ సాహితీ, కౌన్సెలింగ్ సైకాలజిస్టు.
ఇవీ నంబర్లు…