అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడి తీరం వైపు దూసుకొస్తున్న తౌటే తుఫాన్ ఈ నెల 18న ఉదయం గుజరాత్ తీరాన్ని తాకనుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. తుఫాన్ తీరాన్ని తాకేటప్పుడు గంటకు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈదురు గాలులకు తోడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
ఇదిలావుంటే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం 79 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. మరో 22 బృందాలను పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చోటుకు తరలించేందుకు సిద్ధంగా ఉంచింది. ఎన్డీఆర్ఎఫ్తోపాటు ఆర్మీ, నేవీ, కోస్ట్గార్డ్స్ కూడా సహాయక చర్యల్లో పాల్గొననున్నారు. సహాయక చర్యల కోసం పడవలు, ఎయిర్క్రాఫ్ట్లను కూడా వినియోగించనున్నారు.