వాషింగ్టన్ : కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో మరో ముదండుగు పడింది. 12-15 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలకు టీకా అందుబాటులోకి వచ్చింది. ఫైజర్- ఎన్ బయోటెక్ తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్కు అమెరికాలో అత్యవసర వినియోగానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) సోమవారం అనుమతి ఇచ్చింది. ఎఫ్డీఏ కమిషన్ జానెట్ వుడ్కాక్ మాట్లాడుతూ ‘మహమ్మారికి వ్యతిరేక పోరాటంలో ముఖ్యమైన దశ’గా అభివర్ణించారు.
టీకా అందుబాటులోకి రావడంతో పిల్లలను రక్షించడంతో పాటు మహమ్మారి అంతానికి ఉపయోగపడుతుందన్నారు. అందుబాటులో ఉన్న డేటాను ఏజెన్సీ కఠినంగా, సమగ్రంగా సమీక్షించినట్లు తెలిపారు. ఇంతకు ముందు ఎఫ్డీఏ అమెరికాలో 16 సంవత్సరాలు పైబడిన వారికి ఫైజర్ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇచ్చింది. ‘కరోనా మహమ్మారితో కలిగే అపారమైన ప్రజారోగ్య భారాన్ని తగ్గించడంలో యువత కోసం వ్యాక్సిన్ కలిగి ఉండడం చాలా కీలకమైన దశ’ అని ఎఫ్డీఏ సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ పీటర్ మార్క్స్ అన్నారు.
అమెరికాలో గతేడాది మార్చి నుంచి, గత నెల 30వ తేదీ వరకు 11-17 సంవత్సరాల మధ్య వయసున్న 1.5 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారు. ఇదిలా ఉండగా.. ఫైజర్ కంపెనీ 12-15 మధ్య వయస్సున రెండువేల మందికిపైగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఇందులో వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఇంతకు ముందు కెనడా హెల్త్ సైతం పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.