ఖరారు కాని అదనపు కోటా
జిల్లాలో 481 రేషన్ షాపులు
ఆలేరు టౌన్, మే 9 : గత ఏడాది కొవిడ్ నేపథ్యంలో రేషన్ షాపుల్లో పేదలకు ఉచితంగా 4 నెలల పాటు ఒక్కో యూనిట్కు 12కిలోల చొప్పున బియ్యం, ఒక్కో కుటుంబానికి 3నెలల పాటు రెండు కేజీల చొప్పున కందిపప్పు ఉచితంగా అందజేశారు. అయితే ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీం ద్వారా మే, జూన్ నెలల్లో రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు ఉచితంగా 5కిలోల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డుల ద్వారా రూపాయికి కిలో బియ్యం చొప్పున ఒక్కొక్కరికి 6కేజీల బియ్యం సరఫరా చేస్తున్నది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అంతే కాకుండా కరోనా సెకండ్వేవ్ వల్ల థర్డ్ పార్టీ ద్వారా బియ్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని డీలర్లు ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే రేషన్ డీలర్లను కరోనా భయం వెంటాడుతుంది. ప్రతి కార్డుదారునికి ఐరీస్, ఈపోస్, ఓటీపీల ద్వారా రేషన్ సరఫరా చేస్తున్నారు. రేషన్ సరఫరా చేసేటప్పుడు వైరస్ ముప్పు పొంచి ఉందని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మే, జూన్ నెలల్లో ఐదేసి కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందించాలని ప్రకటించింది. ఇంకా ఈ విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. కార్డుదారుల్లో ఒక్కో కుటుంబ సభ్యుడికి ప్రతినెలా ఇచ్చే 6 కేజీల బియ్యానికి అదనంగా 4కిలోలు పెంచి ఇవ్వాలనుకున్నా ఈ నెలలో సాధ్యపడలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే లోగానే మే నెలకు డీలర్లు డీడీలు చెల్లించడం, సమయం లేకపోవడంతో అదనపు బియ్యం అందలేనట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తెల్లరేషన్ కార్డు సభ్యుడికి ప్రతి నెల 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులకు 35 కేజీలు, అన్నపూర్ణ ద్వారా 10కేజీల బియ్యం అందజేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో రేషన్ షాపులు 481. ఆహార భద్రత కార్డులు 2,00,301, అంత్యోదయ కార్డులు 13,704. మొత్తం 2,14,005 ఉన్నాయి. ఇదిలా ఉంటే పలు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యాన్ని తీసుకునేందుకు పలువురు ఆసక్తి చూపించడం లేదు. సన్న బియ్యం తినేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ప్రతి నెల పెద్ద మొత్తంలో బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. మరి కొందరు కిరాణం షాపుల్లోకి వెళ్లి కిలోకు రూ.10చొప్పున అమ్ముకుంటున్నారు. దళారులు ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యాన్ని సేకరించి ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల పలుచోట్ల అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సి ఉన్నది.
ఆదేశాలు రాలేదు
ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే రేషన్ బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ నిబంధనలను పాటించి సరుకులు సరఫరా చేయాలి. అదనపు కోటాపై ఎలాంటి సమాచారం లేదు. థర్డ్ పార్టీ ద్వారా సరుకులు పంపిణీ చేసే విషయమై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.
– గణేశ్నాయక్, తహసీల్దార్, ఆలేరు