న్యూఢిల్లీ: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య, నటి అనుష్క శర్మ ముందుకొచ్చారు. కరోనా బాధితులకు సాయం చేసేందుకు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. కెంటో ప్లాట్ఫామ్ ద్వారా ప్రజల నుంచి దాదాపు రూ.7 కోట్ల నిధులు సమీకరించనున్నారు. బాధితులకు ఆక్సిజన్ అందించడం, వైద్యులను ఏర్పాటు చేయడం, వ్యాక్సినేషన్పై అవగాహన, టెలీ మెడిసన్ సదుపాయాలు సహా మరిన్ని ఏర్పాట్ల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం యాక్ట్ గ్రాంట్స్ అనే సంస్థతో చేతులు కలిపారు. ఏడు రోజుల పాటు ఈ విరాళాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలో వీలైనంత మందికి సాయం చేసేందుకు తాను, అనుష్క ప్రయత్నిస్తామని కోహ్లీ ఈ సందర్భంగా ట్విట్టర్లో తెలిపాడు. అందరం ఐక్యంగా ఉండి, వీలైనంత మంది ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. అలాగే వైరస్ వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి తాను, విరాట్ ఎంతో కలత చెందుతున్నామని అనుష్క చెప్పింది.