అన్ని మతాలను సమానంగా గౌరవించాలనే రంజాన్ దుస్తుల పంపిణీ
ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ బాధితులకు అన్ని సౌకర్యాలు
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
శంకరపట్నంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
శంకరపట్నం, మే 5: ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ఆయన 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ముస్లింలకు రంజాన్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పెళ్లి వరకు పేదింటి ఆడబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ఆడబిడ్డల పెళ్లికి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1,00,116 అందజేస్తున్నట్లు వెల్లడించారు.
అన్ని మతాలకు సమ ప్రాధాన్యం
అన్ని మతాలను సమానంగా గౌరవించాలనే ఉద్దేశంతోనే ముస్లిములకు రంజాన్ దుస్తులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇందులో భాగంగానే రంజాన్ పండుగకు కానుకలతో పాటు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు చెప్పారు. కరోనా ఉధృతి దృష్ట్యా ఈ యేడు ఇప్తార్ విందును ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కరోనా నుంచి కాపాడాలని అల్లాను ప్రార్థించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ దవాఖానల్లో అన్ని ఏర్పాట్లు
కరోనా బాధితులకు ప్రభుత్వ దవాఖానల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రసమయి వెల్లడించారు. కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి వారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు కరోనా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారమివ్వాలన్నారు. కరోనా బాధితులకు వైద్యంతోపాటు ఆక్సిజన్, బెడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, తాళ్లపెల్లి శేఖర్గౌడ్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో భీమేశ్, ఎంపీవో సురేందర్, ఎస్ఐ తిరుపతి, సర్పంచుల ఫోరం మండల చైర్మన్ పల్లె సంజీవరెడ్డి, సర్పంచులు రంజిత్రావు, భద్రయ్య, రజిత, ఎంపీటీసీ కవిత, మండల కోఆప్షన్ సభ్యుడు ఖాజా పాషా, తాడికల్ సింగిల్ విండో చైర్మన్ కేతిరి మధుకర్రెడ్డి, గిర్దావర్లు లక్ష్మారెడ్డి, అరుణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.