మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలి
మండలకేంద్రంలో ఐసొలేషన్ కేంద్రం
స్వచ్ఛంద లాక్డౌన్లు మంచిదే..
డీఎంహెచ్వో చల్లా మధుసూదన్
వర్ధన్నపేట, మే 3: కరోనా వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి చల్లా మధుసూదన్ సూచించారు. మండలంలోని ల్యాబర్తి గ్రామాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్నందున ప్రజలు విధిగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. తరచూ శానిటైజర్లను ఉపయోగించాలని కోరారు. గ్రామాల్లో ఎవరైనా కరోనా బారిన పడితే.. ఇంట్లో వసతులు లేకుంటే మండలకేంద్రంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే 108 వాహనం ద్వారా వరంగల్ ఎంజీఎం దవాఖానలోని కొవిడ్ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. కరోనా కేసులు ఎక్కువైతే గ్రామాల వారీగా స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకోవడం మంచిదని, ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరువ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పస్తం రాజు, ఎంపీటీసీ అన్నమనేని ఉమాదేవి, ఉపసర్పంచ్ పిన్నింటి కళింగరావు, రాయపర్తి పీహెచ్సీ డాక్టర్ వెంకటేశ్, వార్డు సభ్యులు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.
పాజిటివ్ వస్తే మందుల కిట్లు ఇస్తాం
నర్సంపేట: కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మందుల కిట్లు అందిస్తామని నర్సంపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ తెలిపారు. దవాఖానలో కరోనా పరీక్షలను ఆయన పరిశీలించి మాట్లాడారు. పాజిటివ్ వస్తే హోం ఐసొలేషన్లో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల కరోనా టీకాలు వేసుకుంటే మంచిదన్నారు.
45 ఏళ్లు నిండిన వారికే వ్యాక్సిన్
పరకాల/దామెర/నడికూడ: ఇకపై 45 ఏళ్లు నిండిన వారికే వ్యాక్సిన్ వేస్తామని పరకాల సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల సంజీవయ్య తెలిపారు. 45 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ కోసం కొవిన్ యాప్, ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్లోగాని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియపై సందేహాలుంటే హెల్ప్లైన్ 1075 నంబర్లో సంప్రదించాలని కోరారు. దామెరలోని పీహెచ్సీలో 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ వేస్తామని పీహెచ్సీ వైద్యురాలు శిరీష తెలిపారు. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఇక నుంచి 45 ఏళ్లు పైబడిన వారికే కరోనా వ్యాక్సిన్ ఇస్తామని రాయపర్తి పీహెచ్సీ వైద్యాధికారి ప్రదీప్కుమార్ తెలిపారు. టీకా కోసం ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.
14 వరకు లాక్డౌన్..
ఆత్మకూరు: మండలకేంద్రంలో ఈ నెల 14 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు జీపీ పాలకవర్గం సోమవారం ప్రకటించింది. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్నందున స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నట్లు సర్పంచ్ రాజు తెలిపారు. 14 వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు.
వ్యాక్సిన్పై అపోహలు వద్దు
నర్సంపేట రూరల్: కరోనా వ్యాక్సిన్పై గ్రామాల్లోని ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని భాంజీపేట పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్ అన్నారు. భాంజీపేట పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ప్రజలు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యాధికారి కోరారు.
కస్తూర్బా కళాశాలలో ఐసొలేషన్..
శాయంపేట: మాందారిపేట శివారులోని కస్తూర్బాగాంధీ బాలికల జూనియర్ కళాశాలలో కరోనా బాధితుల కోసం ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం తహసీల్దార్ పోరిక హరికృష్ణ పరిశీలించారు. 20 పడకలతో ఐసొలేషన్ వార్డును సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఇంటి వద్ద సౌకర్యాలు లేని వారు ఈ ఐసొలేషన్ కేంద్రానికి రావొచ్చని సూచించారు. ఆయన వెంట గిర్దావర్ హేమానాయక్ ఉన్నారు.
సంగెంలో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు
సంగెం: కరోనా బాధితుల కోసం మండలకేంద్రంలో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ బీ విశ్వనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎస్టీ పోస్ట్మెట్రిక్ హాస్టల్ను పీహెచ్సీ వైద్యాధికారి పొగాకుల అశోక్తో కలిసి సందర్శించారు. ప్రస్తుతం 20 బెడ్స్తో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వచ్ఛంద లాక్డౌన్ చేసుకున్న సర్పంచ్లు తమ తీర్మాన ప్రతులను కమిటీకి అందించాలని సూచించారు. ఎవరైనా కరోనాతో మృతి చెందితే తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు నిర్వహించాని సూచించారు. గ్రామాల్లో పెళ్లిళ్లు చేయాలనుకునే వారు విధిగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వధువు, వరుడు తరఫున హాజరయ్యే 25 మంది చొప్పున బంధువుల జాబితాను అందించాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి, సర్పంచ్ గుండేటి బాబు, ఏఎస్సై వెంకన్న, గిర్దావర్ ఆనంద్కుమార్ పాల్గొన్నారు.
పర్వతగిరి: గురుకుల కళాశాలలో 30 బెడ్లతో ఐసొలేషన్ కేంద్రాన్ని సిద్ధం చేసినట్లు తహసీల్దార్ మహబూబ్ అలీ తెలిపారు. సాంఘిక సంక్షేమ కళాశాలలో ఉన్న ప్రత్యేక గదులను ఐసొలేషన్ వార్డుగా మార్చినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆర్ఐ సత్యనారాయణతో కలిసి సెంటర్ను సందర్శించారు.
32 మందికి కరోనా పాజిటివ్
నెక్కొండ: మండలకేంద్రంలోని పీహెచ్సీలో 25 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రమేశ్ తెలిపారు. అలాగే, అలంకానిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 27 మందికి పరీక్షలు చేయగా, 13 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి సుమంత్ చెప్పారు.