యాదాద్రి భువనగిరి :యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ శివాలయ పునర్నిర్మాణ పనులు శాస్త్ర బద్దంగా సాగుతున్నాయని తొగుట పీఠాధిపతి, శివాలయం నిర్మాణ పర్యవేక్షకుడు మాధవానంద స్వామి తెలిపారు. సోమవారం ఆయన యాదాద్రిశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ప్రధానాలయాన్ని పరిశీలించారు.
శివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన తుది మెరుగుల్లో పలు సూచనలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతంగా, తక్కువ సమయంలో యాదాద్రి ఆలయ నిర్మాణం సాగుతున్నది అన్నారు. ఇంతటి మహా ఆలయం మన సమీపంలో ఉండటం తమ అదృష్టమని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆలయంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. త్వరలో అన్ని పనులు పూర్తి చేసుకుని స్వామి వారి దివ్య దర్శనం కాబోతున్నదని తెలిపారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో గీత ఉన్నారు.