ప్రాణవాయువు తయారీ ఇక్కడే
రోజుకు 30 సిలిండర్ల సామర్థ్యం
60 బెడ్స్కు ఏకధాటిగా సరఫరా
23లక్షలతో ప్లాంట్ ఏర్పాటు
మంత్రి కేటీఆర్ చొరవ
తాజాగా ట్రయల్ రన్ సక్సెస్
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): కరోనా విపత్కర వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏరియా దవాఖానలో మరో అత్యాధునిక వసతి అందుబాటులోకి వచ్చింది. కొవిడ్ రోగులకు ప్రాణవాయువు అందించేందుకు రాష్ట్ర సర్కారు ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దవాఖానలో ఉన్న 60 బెడ్లను 120కి పెంచి వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించడంలో ఇబ్బందులు వస్తున్నాయని గత సోమవారం దవాఖానను సందర్శించిన సమయంలో మంత్రి కేటీఆర్కు సూపరిండెండెంట్ మురళీధర్రావు వివరించారు. ఈ క్రమంలో మంత్రి చొరవతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ముందుకొచ్చింది. దవాఖాన ఆవరణలో 23లక్షలతో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేసింది. కోయంబత్తూరుకు చెందిన టెక్నికల్ సిబ్బంది శనివారం ట్రయల్ రన్ నిర్వహించగా, సక్సెస్ అయింది. నేటి నుంచి ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని సూపరింటెండెంట్ చెప్పారు. ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లో అప్పటికప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి చేసి నేరుగా రోగులకు అందించే వెసులుబాటు ఉంటుంది. ఇది రోజుకు 30 సిలిండర్ల ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తుంది. 60 బెడ్స్కు 24గంటలపాటు సరఫరా అవుతుంది. వెంటిలేటర్పై ఉన్న పేషెంట్లకు నేరుగా పైపులైను ద్వారా సరాఫరా అవుతుంది.