మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కదిలిన జీహెచ్ఎంసీ యంత్రాంగం
కాలనీలు, బస్తీల్లో పారిశుధ్య నిర్వహణపై తనిఖీలు
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 18 : మహానగరంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపర్చాలని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలోని పరిసరాలన్నీ పరిశుభ్రంగా మార్చడంపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టినిసారించారు. రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో చెత్తను తొలగించే పనులపై దృష్టిసారించారు. పరిసరాలన్నీ పరిశుభ్రంగా మార్చడంతో పాటు జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా శానిటేషన్ను చేపట్టనున్నారు. డస్ట్బిన్లను తొలగించిన స్థానంలో చెత్త వేయకుండా చేయడం… రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్న వారికి ముందుగా అవగాహన కల్పించడం.. ఫలితం లేకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, కాలనీల్లో ప్రత్యేక నిఘాతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ… ప్రతి ఇంటినుంచి చెత్తను స్వచ్ఛ ఆటోల్లోనే వేసేలా చర్యలు ప్రారంభించారు. అవసరమైన చోట కొత్త స్వచ్ఛ ఆటోలను కేటాయించడం, ఎప్పటికప్పుడు చెత్తను తరలించే వాహనాల నిర్వహణపై దృష్టినిసారించారు.
కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను ప్రారంభించారు. నాలుగు రోజుల్లో పరిసరాలన్నీ పరిశుభ్రంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ కావడంతో ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. జడ్సీ మమత ఆధ్వర్యంలో సర్కిళ్ల వారీగా ఉప కమిషనర్లు, సీటీవో, డిప్యూటీ సీటీవో, ట్రాన్స్పోర్ట్ ఏఈ, ఏఎంహెచ్వోల బృందం కాలనీలు, బస్తీల్లో పారిశుధ్య పనులపై ఆకస్మిక తనిఖీలను చేస్తున్నారు. సర్కిళ్ల వారీగా ప్రత్యేక ప్రణాళికతో చెత్తను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. పేరుకపోయిన చెత్తాచెదారా న్ని తొలగించేందుకు అదనపు వాహనాలు, డంపర్లు, టిప్పర్లను ఉపయోగిస్తున్నారు. ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించడం.. ఆ సమస్యలను పరిష్కరించేలా చర్యలు ప్రారంభించారు.
జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సోడి యం హైపోక్లోరైడ్ రసాయనాల పిచికారిని చేపట్టారు. ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, పార్కులు, బస్టాండ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో రసాయనాల పిచికారిని ప్రారంభించారు. శానిటేషన్, ఎంటమాలజీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. పారిశుధ్య సిబ్బందికి కావల్సిన శానిటైజర్, మాస్కులు, హ్యాండ్ గ్లౌజులను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ… ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని, తప్పనిసరిగా మాస్కును ధరించేలా జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు వివిధ సేవల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కాలనీలు, బస్తీల్లోని ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని యుద్ధప్రాతిపదికన తొలగించేలా చర్యలు ప్రారంభించాం. ఐదు సర్కిళ్లలో డస్ట్బిన్లను తొలగించిన ప్రాంతాలు, తరచుగా చెత్తవేసే సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టినిసారించాం. ప్రతి ఇంటినుంచి చెత్తను సేకరించడం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వారిని గుర్తించి అవగాహన కల్పిస్తున్నాం. చెత్తను తొలగించడంలో అవసరమైన వాహనాలు, సిబ్బంది పనితీరుపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నాం. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనులు చేయాలని సిబ్బందికి సూచించాం. జనసమూహం ఉండే ప్రాంతాలో రసాయనాలను పిచికారి చేస్తున్నాం. ప్రజలందరూ స్వచ్ఛ పరిసరాల కోసం బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం. వీ మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్