కృష్ణ యజుర్వేద సంబంధమైన ‘అక్ష్యుపనిషత్తు’లోని వేదాంత సిద్ధాంతంలో ‘బ్రహ్మవిద్య’ గురించి వుంది. బ్రహ్మవిద్య అపురూపమైంది. అలభ్యమైంది. దీని సాధకులు కాగోరువారు తొలుత చరాచర సృష్టిలోని సమస్త జీవకోటిని, వస్తు సముదాయాన్ని శాంతచిత్తం, దయార్ద్ర హృదయంతో దర్శించాలి. విశ్వంలో పరమాత్మ నివసించని చోటు లేదని తెలుసుకోవాలి. కామవాంఛలన్నిటినీ చంపుకోవాలి. సోమరితనం వదిలి, మేధస్సును యోగంపైనే కేంద్రీకరింపజేయాలి. మనస్సును, మేధస్సును నియంత్రించాలి. లౌకిక ఆనందాలన్నిటినీ తృణప్రాయం చేస్తూ, క్రమక్రమంగా తత్సంబంధ ఆలోచనలను వదిలేయాలి. నిత్యం ఇలా చేయడం వల్ల గొప్ప అనుభూతికి లోనవుతారు. అసూయ, కోపాలు మొదలైనవన్నీ క్రమంగా నశిస్తాయి. సర్వకాల సర్వావస్థలలోను గొప్ప పనులే చేస్తుండాలి.
ఇతరులు ఆశ్చర్య పడేంతటి శాంతికాముకతను ప్రదర్శించాలి. ఎప్పుడూ కృపాకటాక్ష వీక్షణాలతోనే పనులు చక్కదిద్దుకోవాలి. నేరపూరితమైన పనులకు దూరం కావాలి. భోగలాలసతను విసర్జించాలి. ప్రేమను కురిపించాలి. గొప్పవారు, యోగుల ఆధ్వర్యంలో వేదాధ్యయనం చేయాలి. ఉత్తమోత్తమ సాహిత్యాన్ని చదవాలి. పవిత్రగ్రంథాల అధ్యయనం తప్పనిసరి. అహంకారం, పేరాశ, సంబంధ- బాంధవ్యాలపై పట్టింపులు వంటివన్నీ ‘పాము కుబుసం విడిచినట్లు’గా వదిలేయాలి. ఫలితంగా పవిత్రమైన, నిష్కళంకమైన జ్ఞానాన్ని పొందుతారు.
ఇలా సాధన కఠినతరమవుతుంది. చిత్తం లయమై సుషుప్తావస్థలో శాంతిని పొందుతారు. అశేష జ్ఞానంతో ద్వైతభావం మటుమాయమై అద్వైతంలో లీనమవుతారు. ఇప్పటికి సందేహాలన్నీ తొలగి, అన్యభావనలేవీ లేని ‘జీవన్ముక్త’ స్థితిని చేరుకుంటారు.
యం.వి. నరసింహారెడ్డి
98491 10922