మెదక్, ఏప్రిల్ 13 : యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లు నేటి నుంచి షురూ కానున్నాయి. ఇప్పటికే కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేశ్లు వివిధ శాఖల అధికారులను సమాయత్తం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచిస్తున్నారు. జిల్లాలోని కొన్ని చోట్ల వరికోతలు మొదలవుతుండడంతో ఈ నెల 14వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు.
2.12 లక్షల ఎకరాల్లో వరి సాగు…
ఈ యాసంగి సీజన్లో మెదక్ జిల్లాలో 2 లక్షల 12వేల ఎకరాల్లో వరిని సాగు చేయగా, 5 లక్షల 29వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 4 లక్షల 70వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. అయితే, గతంలో 322 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ యాసంగిలో 350 రైతుల కోసం అందుబాటులో ఉంటాయి. దీంతో రైతులు దళారుల వద్దకు వెళ్లకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తరలించేందుకు నిర్ణయించుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
350 కొనుగోలు కేంద్రాలు…
ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ కమిటీల ద్వారా మొత్తం 350 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ధాన్యం కొనుగోలుచేయడానికి వ్యవసాయ శాఖ అధికారులను సైతం నియమించారు. అంతేకాకుండా ప్యాడి క్లీనర్లు, టార్ఫాలిన్లు తదితర ఏర్పాట్లు ముందుగానే చేసుకుని సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, కొనుగోలు చేసిన 72 గంటల్లోనే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
కోటి 20 లక్షల గన్నీ బస్తాలు అవసరం…
ధాన్యం మిల్లులకు తరలించడానికి గన్నీ బస్తాలు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్, క్లీనింగ్ మిషన్లు సిద్ధం చేస్తున్నారు. మెదక్ జిల్లాకు కోటి 20 లక్షల గన్నీ బస్తాలు అవసరం ఉండగా, ప్రస్తుతం 25 లక్షలు అందుబాటులో ఉన్నాయి. మరో 90 లక్షల లకు ఇండెంట్ పెట్టారు. అంతేకాకుండా, కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడానికి ట్యాబ్స్ను మార్కెటింగ్, పీఏసీఎస్, డీఆర్డీవో, సివిల్ సైప్లె అధికారులు సిద్ధం చేస్తున్నారు.
మద్దతు ధర ఇలా…
ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధాన్యం ధరను పెంచింది. గ్రేడ్ ఏ రకం క్వింటాలుకు రూ.1,888 కాగా, గ్రేడ్ బీ ధర రూ.1868గా నిర్ణయించారు. ధర పెంచడంతో రైతులు దళారుల వద్దకు వెళ్లకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే పంటను తీసుకువచ్చే అవకాశం ఉంది.
నేటి నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం :ఎస్.హరీశ్, మెదక్ కలెక్టర్
ధాన్యం వచ్చిన ప్రాంతాల్లో నేటి నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంటాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించేలా కేంద్రాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాలి. ధాన్యం విక్రయించే రైతులకు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం.