ఖలీల్వాడి, ఏప్రిల్ 5 : కాళేళ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదికి సరికొత్త నడక నేర్పిన సీఎం కేసీఆర్ పరిపాలనలో జీవ నది గోదావరి తెలంగాణ వ్యాప్తంగా బీడు భూములకు జీవం పోస్తూ ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మేడిగడ్డ వద్ద సముద్రమట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో సముద్రానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్ వరకు సుదీర్ఘ దూరంలో గోదావరి జలాలను తరలించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. కాళేళ్వరం ప్రాజెక్టుతో ఇప్పటికే లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నారని పేర్కొన్నారు. పూర్వ వైభవం కోల్పోయిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ తీసుకువచ్చేందుకు కంకణం కట్టుకోవడం శుభపరిణామని అన్నారు.
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి హల్దీవాగు ద్వారా మంజీరా నదిలోకి కాళేశ్వరం జలాలను తీసుకురావడం అద్భుతమని అన్నారు. మంజీరా నదిలోకి వచ్చే కాళేశ్వరం జలాలు నేరుగా నిజాంసాగర్ ప్రాజెక్టును చేరడం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభ పరిణామమని అన్నా రు. మంజీరా నదిపై ఎగువ ప్రాం తంలో కర్ణాటక, మహారాష్ట్ర ఇబ్బడిముబ్బడిగా ఆనకట్టలు కట్టడం తో కొన్నేండ్లుగా నిజాంసాగర్ బోసిపోతున్నదని పేర్కొన్నారు. దీంతో వానకాలంలో సైతం నీరు లేక కళావిహీనంగా మారిందన్నారు. ఈ పరిస్థితిలో కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేళ్వరం జలాలను తరలించడంతో పాత ఆయకట్టు స్థిరీకరణకు నోచుకోవడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రైతాంగానికి రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం దొరకడంతో పాటు సాగునీటి కోసం తిప్పలు పడే దుస్థితి లేకుండా పోతుందని తెలిపారు. మంగళవారం సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ నీరు నిజాంసాగర్కు తరలించేందుకు హల్దీ వాగులో జలాలను విడుదల చేస్తున్న సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ కూడా చదవండి…
బాబూ జగ్జీవన్రామ్ ఆశయసాధనకు కృషిచేయాలి
గడువు ముగిసినా.. తేదీ మార్చెయ్