జానారెడ్డిది మంత్రసాని పాత్రే
ఆయన మాటలు హాస్యాస్పదం
సాగర్లో గెలిచేది టీఆర్ఎస్సే
మీడియాతో శాసన మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి చిట్చాట్
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ‘నెల్లికల్ ఎత్తిపోతల కోసం నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఎంతో కృషి చేసిన. అనేకసార్లు సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి చర్చించిన. ఆ లిఫ్ట్ సాధన విషయంలో జానారెడ్డి చేసిందేమీ ఏమీ లేదు. అది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ పుణ్యమే’నని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖామన్నారు. సోమవారం నల్లగొండలో గుత్తా మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. నెల్లికల్ ఎత్తిపోతల కోసం ఆయనొక్కరే తపన పడినట్టు హాలియా సభలో జానారెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఆ నాడు ఎంపీగా ఉన్న తాను అన్ని విధాలుగా ప్రయత్నం చేశానని, చివరికి తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని అనుమతులు వచ్చేలా కృషి చేసి సీఎం కేసీఆర్తో ప్రారంభోత్సవం చేయించినట్టు గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. ఎత్తిపోతల అనుమతుల కోసం జానారెడ్డి చుట్టపు చూపుగా మాత్రమే తిరిగారని, పెండ్లి చూపులకు పోయిన వాళ్లందరూ పెండ్లి కొడుకు కాలేరని గుత్తా చురక అంటించారు.
నెల్లికల్ లిఫ్ట్ ముమ్మాటికీ సీఎం కేసీఆర్ బిడ్డేనని, జానారెడ్డిదే మంత్రసాని పాత్ర అని పేర్కొన్నారు. కాంగ్రెస్లో గెలిచి, పార్టీ మారిన నేతలు ఈ ఎన్నికల్లో తనను ఓడించి ఖతం చేయాలని చూస్తున్నారన్న జానారెడ్డి.. 1989లో టీడీపీలో గెలిచి పదవులు అనుభవించి కాంగ్రెస్లో ఎందుకు చేరారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాల్లో తమని నమ్ముకున్న ప్రజల కోసం, అనుచరుల భవిష్యత్తు, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీలు మారాల్సిన అవసరం వస్తుందని చెప్పారు. తనతోపాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు పార్టీ మారే ముందు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డికి చెప్పామని, తాము పార్టీ మారడానికి నాయకుల మధ్య ఆధిపత్య పోరే ప్రధాన కారణమని తెలిపారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించలేదని ప్రశ్నించే అధికారం జానారెడ్డికి లేదన్నారు. అక్కంపల్లి రిజర్వాయర్ శిలాఫలకంపై తన పేరు ఉన్నదని గొప్పగా చెప్పిన జానారెడ్డి.. ఆ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమేంటో ఎందుకు చెప్పడం లేదని అడిగారు. కోట్ల విజయ్భాస్కర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జానారెడ్డి హయాంలో పోలీసుల కాల్పులు ఎందుకు జరిగాయనేది చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రారంభోత్సవాలు జరిగిన అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించాలని గుత్తా సుఖేందర్రెడ్డి సాగర్ ప్రజలను కోరారు.