అన్నదాతకు అండగా రాష్ట్ర బడ్జెట్
రైతుబంధు, రుణమాఫీకి భారీగా కేటాయింపులు
పెట్టుబడి సాయానికి 2,95,327 మంది రైతులు అర్హులు
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతలతో సస్యశ్యామలం
నాలుగు నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు
రైతుబీమా, యాంత్రీకరణకు పెద్ద ఎత్తున నిధులు
హర్షం వ్యక్తం చేస్తున్న సంగారెడ్డి జిల్లా రైతాంగం
సంగారెడ్డి మార్చి 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని మరోసారి రుజువైంది. గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రైతుబంధు, పంట రుణమాఫీ, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణకు సర్కారు పెద్దఎత్తున నిధులు ప్రకటించింది. దీంతో సంగారెడ్డి జిల్లాలో పెట్టుబడి సాయం కింద 2.95లక్షల మంది, బీమా ద్వారా 1.73 మంది రైతులు లబ్ధి పొందనుండగా, 1,86,974 రైతుల పంట రుణాలు మాఫీ కానున్నాయి. అలాగే, యాంత్రీకరణపై ప్రభుత్వం దృష్టి సారించడంతో త్వరలోనే కూలీల కొరత సమస్య తీరనుంది. ఇక, సాగునీటి రంగానికి సైతం పెద్దపీట వేసిన ప్రభుత్వం జిల్లాకు రూ.20 కోట్లు కేటాయించింది. కొత్తగా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే డీపీఆర్లను సిద్ధం చేసిన అధికారులు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే అనుమతులు మంజూరు చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఈ రెండు ఎత్తిపోతలు పూర్తైతే సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని మూడు లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందనుంది.
ప్రభుత్వ బడ్జెట్పై అన్నివర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం వ్యవసాయంతోపాటు సాగునీటి రంగానికి భారీగా నిధులు కేటాయించింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుబంధు పథకం, పంటరుణమాఫీ, రైతుబీమా, వ్యవసాయ యాంత్రీకణరకు పెద్దఎత్తున నిధులు కేటాయించింది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని రైతులకు ఎంతో మేలు జరుగనున్నది. ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులతో జిల్లా వ్యవసాయ, సాగునీటి రంగాలకు ఊతం లభించనున్నది. రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 2.95 లక్షల మంది రైతులకు మేలు జరుగనున్నది. అలాగే, రైతు బీమా పథకం ద్వారా 1.73 లక్షల మంది రైతులకు లాభం చేకూరనున్నది. పంట రుణమాఫీ ద్వారా జిల్లాలోని 1,86,974 రైతుల బ్యాంకు రుణాలు మాఫీ కానున్నాయి. రాబోయే రోజుల్లో వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా జిల్లాలోని రైతులకు పెద్దసంఖ్యలో వ్యవసాయ యంత్రాలు అందనున్నాయి. ప్రభు త్వం ఆయిల్పామ్ సాగుచేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు అందజేయనున్నది. ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించింది. జిల్లాలోని రైతులు పలువురు ఆయిపామ్ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అండగా నిలువనున్నది. ఇదిలా ఉంటే సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించింది.
సాగునీటి రంగానికి పెద్దపీట
సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంగారెడ్డి జిల్లాకు రూ.20 కోట్ల నిధులు కేటాయించింది. అలాగే, జిల్లాలో కొత్తగా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను నిర్మించి 3 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందిస్తామని తెలిపింది. జిల్లాలోని రైతులు ఎక్కువగా చెరువులు, బోరుబావుల కింద పంటలను సాగు చేస్తున్నారు. సిం గూరు ప్రాజెక్టు ద్వారా అత్యధికంగా 49వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మంజీర నదిపై 18 ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ ఇందులో 13 ఎత్తిపోతల పథకాలు సరిగ్గా పనిచేయలేని పరిస్థితి ఉంది. దీనిని గమనించి ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించేందుకు వీలుగా సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)లను సిద్ధం చేశారు. పథకం నిర్మాణాలకు వీలుగా త్వరలోనే అనుమతులు జారీ చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు గురువారం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. బసవేశ్వర, సంగమేశ్వర పథకాల నిర్మాణం పూర్తయితే సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందనున్నది.
వెన్నుదన్నుగా ‘రైతుబంధు’ పథకం..
ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందజేస్తున్నది. రైతబంధు పథకం అమలుకు ముందు రైతులు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించి ఆర్థిక ఇక్కట్లుకు గురయ్యేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం రైతుల ఇబ్బందులు తొలిగించేందుకు వీలుగా రైతుబంధు పథకం అమలులోకి తీసుకువచ్చింది. ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నది. గురువారం మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుబంధు పథకానికి రూ.14,800 కోట్ల నిధులు కేటాయించారు. గతేడాది కంటే అధికంగా బడ్జెట్లో రైతుబంధుకు నిధులు కేటాయించారు. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిరాటంకంగా రైతులకు పెట్టుబడి సాయం అందనున్నది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 2,95,327 మంది రైతులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుతున్నది. 2020-21 సంవత్సరం వానకాలం సీజన్లో 2,88,261 మంది రైతులకు రూ.366.71 కోట్లు పెట్టుబడి సాయం అందజేసింది. అలాగే, యాసంగి సీజన్లో 2,95,327 మంది రైతులకు రూ.368.62 కోట్ల పెట్టుబడి సాయం డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతుబంధుకు రూ.14,800 కోట్ల నిధులు కేటాయించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
పంట రుణాల మాఫీ..
సీఎం కేసీఆర్ రైతుల పంటరుణాలు మాఫీ చేస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా పంటరుణాల మాఫీ కోసం బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించారు. రైతు రుణమాఫీకి ప్రభుత్వం రూ.5,225 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఇది వరకే రైతులు బ్యాంకుల నుంచి రూ.25 వేల లోపు తీసుకున్న పంటరుణాలను ఏకకాలంలో మాఫీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో రూ.25వేల లోపు పంటరుణాలు తీసుకున్న రైతులు రూ.18,994 మంది ఉండగా, ఇప్పటి వరకు 11,698 మంది రైతులకు రుణాలను మాఫీ చేసింది. 7,296 రైతుల పంటరుణాల మాఫీ ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తంగా ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని 18,994 మంది రైతులు రూ.25వేల రుణాలు ఏకకాలంలో మాఫీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయనున్నది. ఇందుకోసం బడ్జెట్లో రూ.5,225 కోట్లు కేటాయించింది. సంగారెడ్డి జిల్లాలో రూ.లక్ష లోపు పంటరుణాలు తీసుకున్న రైతులు 1,86,974 మంది ఉన్నారు. త్వరలోనే అందరి రైతులు రుణాలు మాఫీ కానున్నాయి. ప్రభుత్వం రూ.లక్ష లోపు పంటరుణాలు మాఫీ చేయనుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుకు భరోసా ‘రైతుబీమా’..
ప్రభుత్వం రైతులకు రైతుబీమా పథకాన్ని అమలు పరుస్తున్నది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. బీమా చేసుకున్న రైతులు ప్రమాదాల్లో మృతి చెందితో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సొమ్మును అందిస్తున్నది. రైతు బీమా కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయించింది. జిల్లాలో 1,73,864 మంది రైతులకు రైతుబీమా పథకం అమలవుతున్నది. బీమా చేసుకున్న రైతుల్లో 436 మంది మృతి చెందగా, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పు న మొత్తం రూ.21.80 కోట్లు పరిహారం డబ్బులు చెల్లించింది. ఇటీవల మృతి చెందిన మరో 34 మంది రైతుల కుటుంబాలకు త్వరలో బీమా పరిహారం డబ్బులను అందజేయనున్నారు.
యాంత్రీకరణ వైపు అడుగులు..
జిల్లా రైతాంగం ఎక్కువగా కూలీల కొరతను ఎదుర్కొంటుంది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ప్రభుత్వం రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్రాలను అందజేస్తున్నది. దీనికోసం బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించింది. దీంతో జిల్లాలో రైతులకు పెద్ద సంఖ్యలో వ్యవసాయ యంత్రాలు అందనున్నాయి.