హైదరాబాద్, మార్చి 18: ప్రముఖ ఎయిర్ కూలర్ల తయారీ సంస్థ ఖైతాన్.. తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. రూ.50 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ఈ నూతన యూనిట్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 200 నుంచి 250 మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ యూనిట్ను రాష్ట్రంలో ఎక్క డ ఏర్పాటు చేసేదానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఈ ఏడాది చివరినాటికి కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని కంపెనీ డైరెక్టర్ చిరాగ్ శర్మ తెలిపారు. రాష్ట్ర మార్కెట్లోకి నూతన శ్రేణి కూలర్లను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూలర్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యూనిట్ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు, వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ యూనిట్ అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. రూ.3,490 నుంచి రూ.19,990 గరిష్ట ధరలో ఈ కూలర్లు లభించనున్నాయి.