ప్రతి వారం మాదిరే ఈ వారం కూడా మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వాటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ వాటిపై ఎవరికీ పెద్దగా ధ్యాస లేదు. అయితే ఈ శుక్రవారం అందరూ ఫ్లాప్ హీరోలు వస్తున్నారు. చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉన్న కార్తికేయ, విష్ణు, ఆది.. మార్చి 19న తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఈ మూడు సినిమాల్లో చావు కబురు చల్లగా కాస్త ఆసక్తి పుట్టిస్తుంది. బిజినెస్ పరంగా చూసుకున్నా దీనికి సింహభాగం ఇవ్వాలి. ఆర్ఎక్స్ 100 తర్వాత సరైన సక్సెస్ కోసం చూస్తున్న కార్తికేయ చావు కబురు చల్లగా చెప్పడానికి వస్తున్నాడు. గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దాదాపు రూ. 9 కోట్ల బిజినెస్ చేసింది. చాలా రోజుల తర్వాత కార్తికేయ సినిమాపై మంచి ఆసక్తి కనిపిస్తుంది.
ఇక విష్ణు కూడా మోసగాళ్లు సినిమాతో ఈ వారమే వస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ భారీ క్యాస్టింగ్ తో వస్తుంది మోసగాళ్లు. కాజల్ ఇందులో హీరోకు అక్కగా నటించడం గమనార్హం. మరోవైపు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రపంచంలో జరిగిన అత్యంత భారీ ఐటి స్కాం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు జెఫ్రీ. ఈ సినిమాను సొంతంగా విడుదల చేస్తున్నాడు మంచి విష్ణు. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనేది బయటకు రావడం లేదు. ఓన్ రిలీజ్ కాబట్టి రిస్క్ కూడా ఎక్కువే.
మరోవైపు ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న శశి కూడా మార్చి 19నే విడుదల కానుంది. కొన్నేళ్లుగా సోలో మిట్ కోసం చూస్తున్న ఈయనకు ఈ సినిమా కీలకంగా మారింది. ఈ సినిమా బిజినెస్ రూ.2 కోట్లు జరిగింది.
మొత్తానికి ఈ వారం కార్తికేయ కాస్త అడ్వాన్స్ లో ఉన్నాడు. ఒకవేళ ఈయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ వారం చావు కబురు చల్లగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కురిపించడం ఖాయం. అలా కాకుండా మంచు విష్ణు ఏదైనా మాయ చేస్తే మోసగాళ్లు రేసులోకి వస్తుంది. మరి చూడాలి కదా ఈ త్రిముఖ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో.