తరలి వచ్చిన వసంతంతో వనం కొత్తజన్మ ఎత్తుతుంది. ఏడాదికోసారి వచ్చే ఆమని కోసం మానులన్నీ మునుల్లా తపస్సు చేస్తుంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘హరిత హారం’తో రాష్ట్రంలో నవ వసంతం సంతరించుకుంది. పల్లె నుంచి పట్నం వరకు, చిట్టడవి నుంచి కారడవి వరకు జీ‘వన’ నాదాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సంకల్పాన్ని నెరవేర్చే క్రతువులో ‘గ్రీన్ ఇండియా’ చాలెంజ్తో భాగమయ్యారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్. చెట్టు గొప్పదనాన్ని, వనం విశిష్టతను తెలియజేస్తూ ‘వృక్షవేదం’ పుస్తకాన్ని అందించారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్న ఫలితంగా భూగోళం మీద రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కరువులు, లేకపోతే అతి వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు కడగండ్ల పాలవుతున్నారు. ఈ మార్పులకు అనేక కారణాలున్నా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల చదరపు కిలోమీటర్ల మేర అడవుల నరికివేత ప్రధానంగా ముందుకు వచ్చింది. 2000 నుండి 2012 వరకు 2.30 మిలియన్ చదరపు కిలోమీటర్ల అడవి మాయమైందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 2018లో సుమారు 3.60 మిలియన్ హెక్టార్ల ఉష్ణ మండల అడవులు లేకుండాపోయాయని ఒక అంచనా. వాతావరణ మార్పులను నియంత్రించి తిరిగి గాడిలో పడేయాలంటే భూగోళం మీద అడవుల నరికివేతను నియంత్రించడం, నరికివేతకు గురైన అడవులను పునరుజ్జీవింపజేయడం తప్పనిసరి. ఈ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తాత్విక భూమికనివ్వడానికి సంతోష్కుమార్ ఇటీవలే ‘వృక్షవేదం’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ప్రముఖ కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ దీనికి సంపాదకుడిగా వ్యవహరించారు. 110 పేజీల పుస్తకంలో మొత్తం 86 పేజీలలో.. ప్రతి పేజీకి ప్రాచీన భారతీయ సాహిత్యంలో నుంచి వృక్ష సంబంధిత కొటేషన్ను పొందుపరిచారు. వీటిని నీతిశాస్త్రం, మత్స్యపురాణం, మహాభారతం, రామాయణం, శ్రీమద్భాగవతం, చాణక్య నీతి, గౌతమ ధర్మశాస్త్రం, మనుస్మృతి, భరతుని నాట్యశాస్త్రం మొదలయిన గ్రంథాల నుంచి సేకరించారు. దీనినొక బృహత్తర పరిశోధనగా భావించాలి. ఈ పరిశోధనకు పండిత్ నారాయణశర్మ సహకరించారు.
భూగోళం పది వేల ఏండ్ల క్రితం 45 శాతం అంటే 60,000 లక్షల హెక్టార్ల అడవులతో నిండి ఉండేది. ఇప్పుడు అది 31 శాతానికి.. అంటే 40,000 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్న వాస్తవాన్ని ఈ పుస్తకం గుర్తుచేస్తున్నది. గడచిన 10 ఏండ్లలో ఏటా 5.20 మిలియన్ హెక్టార్ల అడవిని మనం భూమి మీద నుంచి మాయం చేశామన్న సత్యాన్ని మన ముందుంచింది. భూమి మీద అడవులను పునరుజ్జీవింపజేయడం మానవాళి ప్రథమ కర్తవ్యమని ఈ పుస్తకం హెచ్చరిస్తున్నది. ఈ మహోన్నత కర్తవ్యంలో భాగంగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం, రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాలు అభినందనీయం, అనుసరణీయం. ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటివి నిరంతరాయంగా సాగాలి. ఇందులో స్ఫూర్తిదాయకంగా కనిపించే అంశం ఏమిటంటే అడవులను దత్తత తీసుకోవడం. సంతోష్కుమార్ స్వయంగా 2,042 ఎకరాల కీసర అడవిని, సినిమా స్టార్ ప్రభాస్ 1,650 ఎకరాల కాజీపూర్ రక్షిత అడవిని, హెటిరో ఫార్మా అధినేత డాక్టర్ పార్థసారథిరెడ్డి 2,543 ఎకరాల ముంబాపూర్- నల్లవెల్లి రక్షిత అడవిని దత్తత తీసుకున్నట్టు పుస్తకంలో పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ఇదొక విలువైన చేర్పుగా భావించాలి.
పుస్తకం కోసం ప్రాచీన భారతీయ సాహిత్యంలో నుంచి ఎంపిక చేసిన వాక్యాలు, వృక్షాలు, అడవుల ఫొటోలు కంటికి ఇంపుగా ఉన్నాయి. పుస్తకాన్ని కళాత్మకంగా, అత్యున్నతంగా రూపొందించడంలో మూన్ ప్రొడక్షన్స్ బడావత్ పూర్ణచందర్, ఆయన సిబ్బంది కృషి స్పష్టంగా కనిపిస్తున్నది. పుస్తకంలో కొటేషన్స్ సంస్కృతం, తెలుగు, ఇంగ్ల్లిష్ భాషలలో ఉన్నందున.. ఇది ఒక మంచి రిఫరెన్స్ గ్రంథంగా మిగిలిపోతుంది. ఈ పుస్తకాన్ని ఇంత అద్భుతంగా ప్రచురించిన రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త సంతోష్కుమార్, సంపాదకుడు దేశపతి శ్రీనివాస్, కంటెంట్ రచయిత, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పరిశోధనకు సహకరించిన నారాయణశర్మ, అనువాదకులు డాక్టర్ దామోదర్రావు, ఫొటోగ్రాఫర్లు, డిజైనర్ అందరూ అభినందనీయులే.
జాతీయ అడవుల పాలసీలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 23 శాతం నుంచి 33 శాతానికి పెంచడం ‘హరితహారం’ లక్ష్యం. ఐదు దశలలో 230 కోట్ల మొక్కలను నాటడం, వాటిలో 80 శాతం మొక్కలను రక్షించుకునే విధంగా జూలై 2015లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన కార్యక్రమం జయప్రదంగా అమలవుతున్నది. ఈ ఐదేండ్లలో 203.60 కోట్ల మొక్కలను నాటినట్టు తెలుస్తున్నది. హరితహారం కార్యక్రమం స్ఫూర్తితో సంతోష్కుమార్ 2018 జూలైలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించారు. అప్పటినుంచి ప్రముఖులు సహా భారీ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొక్కలు నాటి మరో ముగ్గురికి మొక్కలు నాటాలని సవాల్ విసురుతున్నారు. అట్లా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా సాగుతున్నది.
–శ్రీధర్రావు దేశ్పాండే