నాగర్కర్నూల్, జూలై 25 : జిల్లాలోని మండల స్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కమిటీలకు జెడ్పీటీసీలను శాశ్వత సభ్యులుగా పరిగణించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రకటించారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి అధ్యక్షతన జరిగిన జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల అభివృద్ధి సమావేశాలకు జెడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించడం లేదని తనకు ఫిర్యాదు చేశారన్నారు. దీన్ని ఇక్కడే పరిష్కరిస్తూ ఇక నుంచి వారిని శాశ్వత సభ్యులుగా ప్రకటిస్తుండటంతో సహకారశాఖ, మార్కెటింగ్ తదితర అన్ని మండలస్థాయి సమావేశాలకు వారిని విధిగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. సభ్యుల కోరిక మేరకు నాగర్కర్నూల్ జిల్లా దవాఖాన అభివృద్ధి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్కు సూచించారు.
అన్ని జిల్లాల్లో నడుస్తున్నట్లుగా జిల్లాలో సైతం ‘మన ఇసుక’ వాహనం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల కింద నిర్మించిన రిజర్వాయర్ ముంపులో భూములు కోల్పోయిన వారిలో కొందరికి ఇంకా పరిహారం అందలేదని సభ్యులు తమ దృష్టికి తెచ్చారన్నారు. వీటిపై పూర్తి వివరాలు అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇంతవరకు బిల్లులు పెండింగ్లో ఉన్న రైతు వేదికలు, వైకుంఠధామాల వివరాలు అందించాలని ఆదేశించారు. బృహత్ పల్లెప్రకృతి వనాలు మండలానికి కనీసం ఒకటి.. వీలు ఉంటే మరిన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోసేందుకు మార్చి నుంచి నిధులు విడుల చేస్తున్నట్లు తెలిపారు. అయితే నవంబర్ నుంచి అమలు చేసేలా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా సూచించారు. కొత్త పంచాయతీల భవన నిర్మాణాలకు ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ కంపోనెంట్ కింద నిర్మాణాలు చేపట్టేందుకు తీర్మానం చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ అధికారులు సభలో చర్చించిన అంశాలు, సమస్యలపై చర్యలు తీసుకొని సభ్యులకు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యుత్ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని, కనీసం ప్రజాప్రతినిధులు సూచించే పనులపై సైతం స్పందించడం లేదని విద్యుత్ శాఖాధికారిని నిలదీశారు. సభలో వ్యవసాయ, పంచాయతీరాజ్, మైన్స్, విద్యుత్ తదితర కీలక శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఎంపీ రాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన దళితబంధుపై సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతా తీర్మానం సభలో ప్రవేశపెట్టగా విప్ గువ్వల బాల్రాజు బలపర్చగా ఆమోదిస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ ప్రకటించారు. కలెక్టర్ శర్మన్ వివిధ శాఖలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాఖల తరుఫున వివరణలు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో ఆగస్టు ఒకటి నుంచి మన ఇసుక వాహనం ద్వారా గృహ నిర్మాణాలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని మైన్స్ అధికారికి సూచించారు. కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునేందుకు జిల్లా ఆరోగ్యశాఖ సన్నద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అన్ని రకాల సదుపాయాలు సమకూర్చుకున్నట్లు తెలిపారు. సభలో పాల్గొన్న జెడ్పీటీసీలు అనేక అంశాలపై సమస్యలు లేవనెత్తగా అధికారులు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో మండలి సభ్యులు కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు జనార్దన్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, అదనపు కలెక్టర్ మనుచౌదరి, జెడ్పీ సీఈవో ఉషా, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, అధికారులు పాల్గొన్నారు.