నాగర్కర్నూల్, జూలై 11: నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 20మండలాలతో పోల్చుకుంటే అత్యధికంగా నాగర్కర్నూల్ మండలంలో కురిసింది. వర్షం రైతుల్లో ఊరట కలిగిస్తున్నది. మూడు మండలాల్లో మినహా జిల్లా అంతటా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాగర్కర్నూల్లో 120.8 మి.మీ., అత్యల్పంగా కొల్లాపూర్లో 0.8 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, పెంట్లవెల్లి, కల్వకుర్తి డివిజన్లోని చారకొండ, వెల్దండ మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. సగటున 94.62 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు పేర్కొంటున్నారు.
నిండిన చెక్ డ్యాం
మిడ్జిల్, జూలై11: మండలంలో రెండు రోజులు నుంచి కురుస్తున్న వర్షాలకు చెక్డ్యాంలు, చెరువులకు నీరు చేరింది. కొత్తూర్ గ్రామంలో దుందుభి వాగు పారుతుండడంతో చెక్డ్యాం అలుగు పారుతున్నది.
వనపర్తి జిల్లాలో..
వనపర్తి, జూలై11: వనపర్తి జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి ముసురు వాన పడింది. జిల్లా వ్యాప్తంగా సగటున 26.3శాతం నమోదు కాగా అత్యధికంగా పెద్దమందడి మండలంలో 70.1 మిల్లిమీటర్లు, అత్యల్పంగా చిన్నంబావి మండలంలో 1.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
మోస్తరు వర్షం
గద్వాల,జూలై11: జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి గాలి తోడు కావడంతో ఈదురుగాలులతో వర్షం పడింది. జిల్లాలో సరాసరి వర్షపాతం 7.3మి.మీ. నమోదైనట్లు అధికారి లక్ష్మణ్ తెలిపారు.
ముంచెత్తిన ముసురు
మహబూబ్నగర్, జూలై11: జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ముసురు వర్షం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగటున 7.3 మి.మీ. వర్షం కురిసింది. అత్యధికంగా 29.0 మి.మీ. వర్షపాతం నమోదుకాగా అత్యల్పంగా జడ్చర్ల మండలంలో 0.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
జూరాలకు స్వల్ప వరద
ధరూరు, జూలై11: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1100 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,377 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.897 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
టీబీ డ్యాంకూ..
అయిజ, జూలై11: కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వానలకు ఆదివారం 1161 క్యూసెక్కుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 292 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1610.36 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35.942 టీఎంసీలు నిల్వ ఉన్నాయని డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద
కర్ణాటకలో కురుస్తున్న వానలకు ఆర్డీఎస్ ఆనకట్టకు వరద క్రమేపీ పెరుగుతున్నది. ఎగువ నుంచి 2,320 క్యూసెక్కుల వచ్చి చేరుతుండగా కన్స్ట్రక్షన్ స్లూయిస్, స్కవర్ స్లూయిస్ గేట్ల ద్వారా దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి 2,450 క్యూసెక్కులు చేరుతున్నట్లు కర్ణాటక జేఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో నీటినిల్వ 8.2 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు.
20అడుగులకు కోయిల్సాగర్
దేవరకద్ర రూరల్, జూలై11: కోయిల్సాగర్లో ఆదివారం సాయంత్రానికి 20అడుగులకు నీటినిల్వ చేరుకున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ 32.6 అడుగులు(2.3 టీఎంసీలు). కాగా ప్రస్తుతం నీటినిల్వ 20 అడుగులకు చేరింది.