మహబూబ్నగర్ జూలై 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా నిర్వహిస్తున్న సాంఘిక, గిరిజన, బీసీ, జనరల్ గురుకులాల్లో 2021-22 విద్యా సంవత్సారానికి ఆంగ్ల మాధ్యమంలో 5వ తరగతి ప్రవేశానికి సంబంధించి ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆర్సీవో ఫ్లారెన్స్రాణి తెలిపారు. ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా గురుకులాల్లో ప్రవేశానికి సంబంధించి ఉదయం 11 గంటలకు ప్రవేశ పరీక్షను నిర్వహించారు. మహబూబ్నగర్లో 6, జోగులాంబ గద్వాల జిల్లాలో 8, నారాయణపేట జిల్లాలో 3 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7,026 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 6,159 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 867 మంది గైర్హాజరయ్యారు. 87.66 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు తెలియజేశారు.
గురుకుల పరీక్షకు 387మంది హాజరు
రాష్ట్రవ్యాంగా ఆదివారం ఐదో తరగతి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో భాగంగా మండలంలోని నంచర్ల సాంఘిక సంక్షేమ గురుకులంలో నిర్వహించిన పరీక్షకు 387మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 500 మంది విద్యార్థులను కేటాయించగా.. బాలికలు 235 మందికిగానూ 177మంది హాజరయ్యారు. బాలురు 265మందికి 210 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాధికారి ఉషారాణి పరీక్ష కేంద్రాన్ని సందర్శంచి పర్యవేక్షించారు. మొత్తం 113మంది బాలబాలికలు పరీక్షకు గైర్హాజరయ్యారని, 77.4శాతం విద్యార్థులు పరీక్ష రాశారని ప్రిన్సిపాల్ వెంకటమ్మ తెలిపారు.