భూత్పూర్, సెప్టెంబర్ 21: టీకాతోనే కరోనాను నిర్మూలించవచ్చని, ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని తాసిల్దార్ చెన్నకిష్టన్న పేర్కొన్నారు. మండలంలోని కర్వెన, కొత్తూర్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలను మంగళవారం తాసిల్దార్ పరిశీలించి మాట్లాడారు. ఆరురోజులగా మండలవ్యాప్తంగా 5,951మంది వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలిపారు. కర్వెన, కొత్తూర్, రాందాస్తండా, సిద్దాయపల్లి కేంద్రాల్లో వ్యాక్సిన్ కొరతతో ఆరోగ్య సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కార్యక్రమంలో సీహెచ్వో రామయ్య, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 21: 18ఏండ్లు పైబడిన వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని జడ్చర్ల ఆర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ శివకాంత్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా మున్సిపాలిటీలోని వ్యాక్సినేషన్ సెంటర్లను మంగళవారం డాక్టర్ శివకాంత్ పరిశీలించారు. 3వ వార్డులో కౌన్సిలర్ సతీశ్, 4,9వ వార్డుల్లో కౌన్సిలర్లు దేవా, చైతన్యచౌహాన్ పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. కార్యక్రమంలో వైద్య, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ, ఆశకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, సెప్టెంబర్ 21: అర్హతగల ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అపోహలు పక్కనపెట్టి ప్రతిఒక్కరూ రెండు డోస్లు టీకా వేయించుకుంటే పూర్తిస్థాయిలో వైరస్ను కట్టడిచేసే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో అవగాహన కల్పించడంతోపాటు, వ్యాక్సిన్ పంపిణీ వివరాలను ముందస్తుగా తెలియజేయాలని వైద్యసిబ్బందికి సూచించారు.