మూసాపేట(అడ్డాకుల), జూలై25: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు ఓ పేద సర్పంచ్కు గూడు నిచ్చింది. కేటీఆర్ ఇచ్చిన పిలుపు ఓ కుటుంబానికి నీడ నిచ్చింది. రెండో పర్యాయం సర్పంచ్గా కొనసాగుతున్నా కనీసం ఇల్లు కూడా లేని అడ్డాకుల మండలంలోని తిమ్మాయపల్లి సర్పంచ్ ఆంజనేయులుకు ఆర్థిక సహాయం అందజేశారు. అండగా ఉంటానని హామీ ఇచ్చి, ఇంటి నిర్మాణానికి భరోసా నిచ్చారు. 2006లో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఆంజనేయులు భార్య సర్పంచ్గా గెలుపొందింది. ప్రస్తుతం ఆంజనేయులు తిమ్మాయపల్లి సర్పంచ్గా కొనసాగుతున్నారు. నీతి నిజాయితీగా ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇప్పటికీ చిన్న పెంకుటిల్లులో నివాసం ఉంటున్నారు. ఇటీవల గుండే సంబంధ వ్యాధి రావడంతో ఆర్థిక సాయం అందించారు.
అయితే పక్కా ఇల్లు కూడా లేని దీనస్థితి చూసి ఎమ్మెల్యే
ఆల చలించిపోయారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా సర్పంచ్కు ఇంటి నిర్మాణానికి రూ. 2.50 లక్షలు చెక్కును అందజేశారు.
డబ్బులిస్తారని ఊహించలేదు
నా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది కరం. ప్రజలతో కలుపుగోలుగా ఉండడంతో పాటు, నా వంతు సహకారం అందిస్తూ ఉంటాను. అందుకే ప్రజలు నా భార్యను, నన్ను ఇద్దరినీ సర్పంచ్గా ఎన్నుకున్నారు. నేను అనారోగ్యానికి గురైతే కూడా ఎమ్మెల్యే ఆల ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం అందించడంతో బతికి బయటపడ్డాను. పాత ఇల్లు ఉంది. వర్షానికి, ఎండకు, చలికి ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నాం. కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చి నూతన ఇల్లు కట్టుకో అని రూ. 2.50 లక్షల చెక్కును అందజేశారు. ఈ విషయం ఊహించలేదు. జీవితాంతం రుణపడి ఉంటాను.
మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు..
మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు వృథా ఖర్చులు చేయకుండా ఎవరికైనా సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన మాటలకు నేను ఫిదా అయ్యాను. అందుకే ఫాలో అయ్యాను. రెండు సార్లు సర్పంచ్గా చేసినా ఇల్లు లేదంటేనే అతని పరిస్థితి అర్థమౌతున్నది. అందుకే ఇల్లు కట్టుకునేందుకు సాయం అందించాను. పేదలు, ఉద్యమకారులకు నా వంతు సహకారం అందిస్తూనే ఉంటాను.