మహబూబ్నగర్ టౌన్, సెప్టెంబర్ 24: పాలమూరు విశ్వవిద్యాలయాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు సహకారం అందిస్తామని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంపై పీయూలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సెమినార్కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద విదేశీ విద్యను అభ్యసించేందుకు రూ.20లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నదని తెలిపారు. అదేవిధంగా బీసీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఈ పథకాలు ఉన్నాయని జిల్లా నుంచి వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో పీయూ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రం, దేశంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాల్లో ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఉండడం, ఎక్కువ మందికి అవకాశాలు ఉన్నందువల్ల ప్రభుత్వం కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నదని పేర్కొన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ అన్నివర్గాల వారి అభివృద్ధి కోసం రిజర్వేషన్ కల్పించడం మూలంగానే ఇది సాధ్యమవుతుందని తెలిపారు.
సోమవారం నుంచి పీయూలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ సంక్షేమ శాఖల బృందాన్ని అక్కడే వారం రోజులపాటు ఉండేలా ఏర్పాటు చేసి, వీలైనంత ఎక్కువ మంది విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని పూర్తి చేయడమే కాకుండా, విదేశాలకు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. పీయూ నుంచి కనీసం వందమంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలని కోరారు. గతంలో హరితహారం కింద విశ్వవిద్యాలయానికి 50వేల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించగా, లక్షా18వేల మొక్కలు నాటి వృక్షమిత్ర అవార్డు వచ్చేలా కృషి చేశారని, యూనివర్సిటీ వైస్చాన్స్లర్, అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పీయూలోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదుట మొక్కలు నాటారు. కార్యక్రమంలో పీయూ వైస్-చాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్ట్రార్ పిండి పవన్కుమార్, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి, డీటీడబ్ల్యూవో శ్రీనివాస్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిర, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి యాదయ్య, పీయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ మాలతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.