బాలానగర్, ఆగస్టు 1 : పల్లెల్లో ప్రతిష్ట నిఘా ఏర్పాటుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రోజురోజుకూ పెరుగుతున్న గొడవలు, దోపిడీలు, దొంగతనాలను అదుపు చేసేందుకుగానూ సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అన్ని గ్రామపంచాయతీల్లో సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. బాలానగర్ మండలంలో 37 గ్రామపంచాయతీలు ఉండగా, మూడు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. బాలానగర్లో 20, పెద్దాయపల్లిలో 14, హేమాజీపూర్లో 12 సీసీ కెమెరాలు ఉన్నాయి. మిగతా గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. గ్రామస్తులు ఇండ్ల ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలను నియంత్రించవచ్చని చెబుతున్నారు. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన బంగారం, విలువైన వస్తువులను చోరీకి పాల్పడే దొంగలను త్వరగా గుర్తించి సొమ్మును రికవరీ చేసే అవకాశం ఏర్పడుతుంది. అలాగే గ్రామాల్లో అల్లర్లు, దొంగతనాలకు చెక్ పడుతున్నది. అలాగే నేర పరిశోధన కూడా సులువుగా మారుతున్నది. అన్ని గ్రామపంచాయతీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
14 సీసీ కెమెరాలు ఏర్పాటు
మా గ్రామంలో 14 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇందుకు గ్రామస్తులు, దాతలు సహకరించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. పంచాయతీ అభివృద్ధిలో గ్రామస్తులను భాగస్వామ్యం చేసి సమస్యలు పరిష్కరిస్తున్నాం.
అన్ని జీపీల్లో ఏర్పాటు చేసుకోవాలి
నేరాల నియంత్రణకు అన్ని గ్రామపంచాయతీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. నేరం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. ప్రధాన రోడ్లపై ప్రమాదాలు జరిగితే వాహనాలు దారి మళ్లించి వెళ్తుంటారు. అలాంటి వాహనాలను పట్టుకొని బాధితులకు న్యాయం చేయవచ్చు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలను అరికట్టవచ్చు.