మక్తల్రూరల్, ఆగస్టు 4: మండలంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. వ్యవసాయరంగానికి మెరుగైన విద్యుత్ అందించడానికి, రైతులకు లోఓల్టేజీ సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం అదనపు సబ్స్టేషన్లను మంజూరు చేసింది . ఈ మేరకు మండలంలోని కర్ని, గుడిగండ్ల, మాగనూర్ మండలంలో నేరడిగొమ్ము గ్రామంలో మూడు విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. దాదాపు రూ.3.5కోట్ల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారు. పూర్తయిన సబ్స్టేషన్లను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. వారం రోజులలో కర్ని, గుడిగండ్ల, నేరడిగొమ్ములోని 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు ఆశాఖ మక్తల్ ఏడీ లక్ష్మీనర్సింహారావు మంగళవారం తెలిపారు. ఒక్కో సబ్స్టేషన్లో 5 ఎంవీఈఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లను అమర్చారు. స్థంభాల ఏర్పాటు, లైనింగ్ పనులు, టెక్నికల్గా సమస్యలను అధిగమించి నిర్మాణం పనులను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. నిర్మాణ పనులు వందశాతం పూర్తి చేశామన్నారు. ఇదిలావుండగా కర్ని గ్రామంలో సబ్స్టేషన్కు రోడ్డు సమస్య ఏర్పడింది. అయితే ప్రస్తుతం లింగమయ్య ఆలయం నుంచి సబ్స్టేషన్కు కాలిబాట ఉందని, సబ్స్టేషన్కు రోడ్డు మార్గంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. వారం రోజుల్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా పరిష్కరించి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏడీ లక్ష్మీనర్సింహారావు, ఏఈ భాస్కర్ తెలిపారు.
తీరనున్న విద్యుత్ సమస్య
మక్తల్ మండలంలోని గుడిగండ్ల, కర్ని, మాగనూర్ మండలంలోని నేరడిగొమ్ములో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభిస్తే ఆయా సబ్స్టేషన్ల పరిధిలో దాదాపు పది గ్రామాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడుతుంది. కొన్నేండ్లుగా కర్ని గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నది. గ్రామంలో లోఓల్టేజీ సమస్యతో మోటారు పంపు షెడ్లు కాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లో ఓల్టేజీ సమస్య వల్ల ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం సబ్స్టేషన్ పూర్తికావడంతో సబ్స్టేషన్ పరిధిలోని ఖానాపూర్, చిట్యాల, రుద్రసముద్రం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. అలాగే గుడిగండ్ల పరిధిలో జౌళాపురం, గుడిగండ్ల, ఎలిగండ్ల, గున్ముకుల గ్రామాల రైతులకు లోఓల్టేజీ సమస్య తీరనున్నది.