ఆత్మకూరు, అక్టోబర్ 12 : జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1,02,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. మంగళవారం రాత్రి 16 గేట్లెత్తి 65,232 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 730, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు వదిలారు. 38,986 క్యూసెక్కులతో ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లోని 12 యూనిట్లలో నిర్విరామంగా విద్యుదుత్పత్తి నిర్వహిస్తున్నారు. ప్రాజె క్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.670 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి 1,06,736 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
టీబీ డ్యాంకు నిలకడగా వరద..
అయిజ, అక్టోబర్ 12 : తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతున్నది. మంగళవారం ఇన్ఫ్లో 14,009, అవుట్ఫ్లో 13,698 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాంలో 100.855 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
ఆర్డీఎస్ ఆనకట్టకు 41,318 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 40,850 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.7 అడుగుల మేర నీటిమట్టం ఉండగా, ప్రధానకాల్వకు 468 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైలం నాలుగు గేట్లెత్తి..
శ్రీశైలం, అక్టోబర్ 12 : శ్రీశైలం జలాశయానికి వరద స్థిరంగా కొనసాగుతున్నది. మంగళవారం నాలుగు క్రస్ట్గేట్లను 10 అడుగుల ఎత్తులో తెరిచి దిగువన ఉన్న సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 1,63,258 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు తెలిపారు. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు, న్వి 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 884.80 అడుగుల వద్ద 214.3637 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి మొత్తంగా 1,50,415 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.