ఆత్మకూరు, సెప్టెంబర్ 23 : జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల లేకు న్నా.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతున్నది. దీంతో 44 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 40,388 క్యూసెక్కులుగా నమోదైంది. భీమా-1కు 650, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడమ కాలువకు 975, కుడి కాలువకు 672, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 37,100 క్యూసెక్కులు విద్యుదుత్పత్తికి వినియోగిస్తుండగా.. ఎ గువ, దిగువ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతున్నది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 8.969 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద లభ్యతను బట్టి ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని విద్యుదుత్పత్తి నిర్వహిస్తున్నట్లు జెన్కో డైరెక్టర్ వెంకటరాజం తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎగువ జూరాలలో ఐదో యూనిట్ను వారం రోజుల్లో వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. గత సీజన్తో పోలిస్తే ఈ ఏడాది ముందస్తుగానే వరదలు వచ్చి ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ.. వరద ఉధృతి అధికంగా రావడంతో అవాంతరాలు వచ్చాయన్నారు. విద్యు త్ ఇంజినీర్లతో సమావేశమై ప లు అంశాలపై చర్చించారు. ఎ గువ జూరాలలో 200 మిలియ న్ యూనిట్ల మార్కు చేరడంపై ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈలు జయరాం, వర్మ, శ్రీధర్, డీఈలు పవన్కుమార్, విన్నూత్, కృష్ణకిషోర్, బాల్రెడ్డి, ఏడీలు, ఏఈలు పాల్గొన్నారు.
తుంగభద్ర డ్యాంకు స్వల్ప వరద
కర్ణాటకలో కురుస్తున్న మోస్తరు వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. గురువారం ఇన్ఫ్లో 10,545 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 10,569 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు సామర్థ్యం 100.855 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 100.470 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా పెరిగింది. ఆనకట్టకు 17,100 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, 16,650 క్యూసెక్కు లు వరద ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 9.5 అడుగుల మేర నీటిమట్టం ఉండగా.. ప్రధాన కాల్వకు 450 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.