మహబూబ్నగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద భారీగా కొనసాగుతున్నది. దీంతో ఆదివారం జూరాలకు 16 గేట్లు ఎత్తారు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి సైతం పూర్తి స్థాయిలో చేపట్టారు. స్పిల్ వే ద్వారా 64,992, విద్యుదుత్పత్తి ద్వారా 34,301 క్యూసెక్కులు మొత్తం కలిపి 1,01,056 క్యూసెక్కులు దిగువనకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.970 మీటర్లకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా… 8.551 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం నెట్టెంపాడుకు 750, ఎడమ కాలువకు 430, కుడి కాలువకు 362, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రాత్రి ఇన్ఫ్లోన్ 83,700 క్యూసెక్కులు నమోదు కావడంతో మూడు గేట్లను మూసివేశారు. మరోవైపు ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా 98.09 టీఎంసీలకు చేరుకున్నది. ఇన్ఫ్లో 52247 క్యూసెక్కులుండగా, అవుట్ఫ్లో సైతం 52,247 క్యూసెక్కులుగా ఉంది.
ఇక నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా… 34.61 టీఎంసీలకు చేరింది. ఇన్ఫ్లో 60,185 క్యూసెక్కులుండగా.. అవుట్ ఫ్లో 62,800 క్యూసెక్కులుగా నమోదైంది. భీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 117.24 టీఎంసీలు కాగా.. 61.19 టీఎంసీలకు చేరింది. ఉజ్జయిని ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తక్కువగా ఉన్నది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా.. ఆదివారం సాయంత్రానికి 46.72 టీఎంసీలకు చేరుకున్నది. తుంగభద్రకు 57,127 క్యూసెక్కుల వరద వస్తోంది. కృష్ణ, తుంగభద్ర, భీమా, హంద్రి నదుల సంగమం తర్వాత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. 215.81 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం
ఇప్పటి వరకు 38.07 టీఎంసీల వద్దే ఉన్నది. ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రానికి 53,307 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 7,395 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నందున కృష్ణానదికి రాబోయే వారం రోజులు భారీగా వరదలు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. మరోవైపు కర్నాటక, తెలంగాణ పరిధిలోనూ సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదికి వరద పెరిగే అవకాశం ఉన్నదంటున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు లు 90 శాతానికిపైగా నిండి ఉండటంతో వరద తాకిడి ని బట్టి దిగువనకు నీటి విడుదల పెంచే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. నారాయణపే ట, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలోని నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
విద్యుదుత్పత్తి
జూరాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. ఎగువ జూరాలలో 5 యూనిట్లు, దిగువ జూరాలలో 5 యూనిట్లలో పూర్తిస్థాయి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి అవుతున్నది. ఎగువ జూరాలలో ఆదివారం ఒక్కరోజే 4.6 మిలియన్ యూనిట్లతో ఇప్పటివరకు 34.86 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా, దిగువ జూరాలలో 3.92 మిలియన్ యూనిట్లతో ఇప్పటివరకు 39.92 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది.
పర్యాటకులతో కళకళ..
జూరాల గేట్లు ఎత్తడంతో ప్రాజక్టుకు సందర్శకుల తాకిడి ప్రారంభమైంది. ఆదివారం సెలవుదినం కావడంతో ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు పో టెత్తారు. సందర్శకుల తాకిడితో ప్రాజెక్టుపై తినుబండరాల వ్యాపారాలు విస్తారంగా వెలిశాయి. మరోవైపు ఎడమకాల్వ పక్కన లభించే చేప వేపుళ్లకు పర్యాటకు లు ఆసక్తి చూపారు. చాలామంది సందర్శకులు డ్యాం దిగువన పుష్కరఘాట్లను దాటుకొని నీటిలోకి ప్రవేశిం చి ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. డ్యాం వద్ద రక్షణ చర్యలు లేకపోవడంతో సందర్శకులు నిషేధిత ప్రాంతాల్లో సైతం పర్యటిస్తూ సెల్ఫీలు దిగారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద
కర్ణాటకలో కురుస్తున్న వానలకు ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి 470 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, కన్స్ట్రక్షన్ స్లూయిస్, స్కవర్ స్లూయిస్ గేట్ల ద్వారా దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి 965 క్యూసెక్కులు చేరుతున్నట్లు కర్ణాటక జేఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 4.7 అడుగుల నీటినిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైలం ఇన్ఫ్లో@69,855 క్యూసెక్కులు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతున్నది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో భారీగా ఇన్ఫ్లో నమోదవుతున్నది. మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 65,472 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 34,924 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,00,396 క్యూసెక్కులు విడుదల కాగా ఆదివారం సాయంత్రానికి 69,855 క్యూసెక్కులు రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి స్థాయి సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 41.1060 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 820.40 అడుగులకు చేరినట్లు పేర్కొన్నారు.