కల్వకుర్తి రూరల్, జూలై 4: హరితహారంలో భాగంగా అన్ని గ్రామాల్లో వివిధ మొక్కలతోపాటు ఐదువందల పండ్ల మొక్కలను కూడా పెంచాలని కలెక్టర్ శర్మన్ చౌహాన్ సూచించారు. ఆదివారం కల్వకుర్తి మండలంలోని మార్చాల, కుర్మిద్ద, జీడిపల్లి గ్రామాలతోపాటు కల్వకుర్తి పట్టణంలో ఆయన పర్యటించారు. ఊర్కొండ మండలంలో పర్యటించిన అనంతరం కల్వకుర్తి మండలం మార్చాల గ్రామానికి చేరుకొని సర్పంచ్ మల్లయ్యతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో పల్లె ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. అనంతరం కుర్మిద్ద గ్రామంలో పర్యటించి మొక్కలు నాటారు. విరివిగా మొక్కలు నాటుతూ గ్రామాలను హరితమయం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పండ్ల మొక్కలను ప్రతి ఇంటికీ ఇవ్వడంతోపాటు వాటిని సంరక్షించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంటికీ నిమ్మ, బొప్పాయి, సీతాఫలం, వంటి ఆరు పండ్ల మొక్కలను ఇవ్వాలని చెప్పారు.
జీడిపల్లిలో రైతువేదికను పరిశీలించి పరిసరాల్లో గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ను గ్రామ ప్రజాప్రతినిధులు సత్కరించి పూలమొక్కను అందజేశారు. అనంతరం కల్వకుర్తి పట్టణంలోని పశువుల సంతను సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడారు. సంతలో రైతులకు, పశువులకు తాగునీరు లేదని కలెక్టర్కు వివరించగా సమస్యను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ జాకీర్ అహ్మద్ను ఆదేశించారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో నర్సింగ్రావు, సర్పంచులు మల్లయ్య, జ్యోతి, కల్పన, ఉపసర్పంచులు సత్యం, ఖాజా, ఎంపీటీసీ శంకర్నాయక్, ఎంపీడీవో బాలచంద్రసృజన్, ఎంపీవో దేవేందర్, విద్యుత్ శాఖ ఏఈ అమర్సింగ్, ఆర్ఐ శశిధర్రావు, కార్యదర్శులు రమేశ్, బాల్రాజు, దీపారెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులకు కలెక్టర్ అభినందన
మండలంలోని జీడిపల్లిలో ప్రకృతి వనం గ్రామం మధ్యలో పలు రకాల మొక్కలతో చక్కగా నిర్వహించడం, రైతువేదికను నాణ్యతగా నిర్మించడంతో సర్పంచ్ కల్పన, ఉపసర్పంచ్ ఖాజా, ఎంపీటీసీ శంకర్నాయక్తోపాటు కార్యదర్శి దీపారెడ్డిని కలెక్టర్ అభినందించారు. ప్రకృతి వనంలో కలియ తిరిగి మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ను ప్రజాప్రతినిధులు శాలువాతో సత్కరించారు. అదేవిధంగా కల్వకుర్తి పట్టణంలో యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో కరోనా విపత్తు వేళ మిషన్ ఫర్ ఆక్సిజన్తోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై సభ్యులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఆర్డీవో నర్సింగ్రావు, ఎంపీడీవో బాలచంద్రసృజన్, ఎంపీవో దేవేందర్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని కలెక్టర్ శర్మన్ అన్నారు. ఆదివారం పల్లెప్రగతిలో భాగంగా మండలకేంద్రంలో చేపట్టిన పనులను ఆయన ఆదివారం పర్యవేక్షించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో హరితహారంలో భాగంగా 500 పండ్ల మొక్కలు నాటాలని సూచించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా గ్రామస్తులు ముందుకు రావాలని సూచించారు. మండలకేంద్రంలో మహిళలకు ఒక్కొక్కరికీ 6 మొక్కలు అందించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, ఎంపీపీ రాధాజంగయ్య, జెడ్పీటీసీ శాంతకుమారీరవీందర్, సర్పంచ్ రాజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిరినాయక్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.