ఊట్కూర్, జూలై 14 : పంట సాగుకు ముందు రైతన్నలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడితో పాటు అధిక లాభం పొందవచ్చు. అందులో ప్రధానంగా మేలు రకం విత్తనాలను ఎంపిక, విత్తన శుద్ధి పాటిస్తే పంట ను తెగుళ్ల బారిన పడకుండా రక్షించుకోవచ్చని మండల వ్యవసాయాధికారి గణేశ్రెడ్డి తెలిపారు. మొదటగా విత్తన శుద్ధి చేసినట్లయితే పైరుకు ఆశించే తెగుళ్లను కొంతవరకు నిలువరించే అవకాశం ఉంటుందన్నారు. వానకాలంలో బోర్లు, బావుల కింద మెట్ట పొలాల్లో వేరుశనగ, కంది, పత్తి, వరి పంట సాగు చేసే రైతులు విత్తనశుద్ధి పాటిస్తే మంచి ది గుబడితోపాటు తక్కువ ఖర్చుతో అధిక లాభం పొందవచ్చ ని వివరించారు.
విత్తన శుద్ధితో ప్రయోజనాలు..
విత్తనం, నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు, పురుగులను సమర్థవంతంగా నివారించడానికి విత్తనశుద్ధి దోహదపడుతున్నది.
శుద్ధికి వినియోగించే మందులు విత్తనంలోకి చొచ్చుకొనిపోయి శిలీంద్రాలను నాశనం చేస్తాయి.
విత్తనశుద్ధి చేసిన తర్వాత మొలకెత్తిన లేత మొక్కలు నేలలో ఉన్న శిలీంద్రాల నుంచి రక్షణ పొందుతాయి.
తక్కువ ఖర్చుతో పురుగులు, తెగుళ్లు పంటను ఆశించకుండా చేయవచ్చు
విత్తనం మొలక శాతం పెరుగడానికి దోహదపడుతున్నది.
జాగ్రత్తలు…
విత్తనశుద్ధిలో తగిన మోతాదులో మాత్రమే మందు లు వాడాలి. మోదాతు మించితే విత్తన మొలక శాతం దెబ్బతింటుంది.
విత్తనాన్ని శిలీంద్ర నాశిని పురు గు మందుతో శుద్ధి చేసిన తర్వాత జీవ రసాయనాలతో మరోసారి శుద్ధి చేయాలి.
శుద్ధి చేసేటప్పడు గింజ పగులకుండా, పైపొర పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
విత్తనాలను శుద్ధి చేసేటప్పుడు రైతులు చేతులకు గ్లౌజులు వేసుకుని ముఖానికి తప్పకుండా మాస్కులు కట్టుకోవాలి.
రైతులకు అవగాహన..
పక్షం రోజులుగా గ్రామాల్లో వానకాలం సాగుపై రైతన్నలకు సూచనలు, సలహాలు ఇచ్చి అవగాహన కల్పిస్తున్నాం. అందులో ప్రధానంగా విత్తనశుద్ధి, మేలు రకం విత్తనంపై రైతులు సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. చాలా మంది రైతులు విత్తన శుద్ధి, మేలైన రకం విత్తనా లు అనుసరిస్తున్నారు. అన్నదాతలకు పూర్తి సహకారం అందిస్తాం. సంబంధిత గ్రామాల వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు సమాచారం పొందవచ్చు.