మహబూబ్నగర్, జూలై 22 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురుస్తున్నది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతున్నది. పలు వాగుల్లో చెక్డ్యాంలు నిండి అలుగులు పారుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2సె.మీ. వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట మండలంలో 21.0 మి.మీ. కోయిలకొండలో 14.4, గండీడ్లో 26.6, హన్వాడలో 26.6, మహబూబ్నగర్ రూరల్ మండలంలో 3.4, దేవరకద్రలో 25.4, అడ్డాకులలో 24,8, మూసాపేటలో 28,9, మహబూబ్నగర్లో 40.8, నవాబ్పేటలో 30.9, బాలానగర్ 30,9, జడ్చర్లలో 39.9, మిడ్జిల్లో 31.8, మహ్మదాబాద్ మండలంలో 40,6 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, మరో రెండు, మూడురోజులపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన మేరకు అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. గురువారం జిల్లాకేంద్రంలోని రామయ్యబౌలి, వేపూరిగేరి తదితర లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ వెంకట్రావు పర్యటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మురుగుకాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే కలెక్టరేట్లో ఏర్పా టు చేసిన కంట్రోల్రూం నంబర్ 08542-241165ను సంప్రదించాలని సూచించారు.
పోలీసులు అలర్ట్
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హె చ్చరికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు ఆదేశించారు. వాగుల దగ్గర ప్రమాద సూచికలను ఏర్పాటు చే యాలని, పాత ఇండ్లల్లో ఉన్న వారిని గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. వర్షాలతో ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజాప్రతినిధు లు, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు పట్టణలు, గ్రామాల్లో పర్యటించి పాత ఇండ్లల్లో నివాసం ఉంటున్న వారిని గుర్తిస్తున్నారు. వర్షాలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దుందుభీవాగుకు వరద
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో దుందుభీవాగు ప్రవహిస్తున్నది. జడ్చర్ల మండలంలోని లింగంపేట చెక్డ్యాం అలుగు పారుతున్నది. ముసురు వర్షాలకు పంటచేలలో నీరు నిల్వడంతో కలుపు తీసే అవకాశం లేకుండాపోయింది. అలాగే వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే మెట్టపంటలు దెబ్బతినే అవకాశం ఉంది. కాగా, వరిసాగు చేసే రైతులకు వర్షాలు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు.. కరిగెట్లు చేసి నాట్లు వేస్తున్నారు. అలాగే బాలానగర్ మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది.
పంట పొలాల్లో నీరు నిల్వకుండా చూడాలి
పంట పొలాల్లో వర్షపునీరు నిల్వకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి నరేందర్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా పత్తి, కంది, జొన్న, మొక్కజొన్న పంటచేలల్లో నీరు నిల్వకుండా కాల్వలు తీయాలని తెలిపారు. అలాగే వర్షాలు తగ్గేవరకు వ్యవసాయ పనులను వాయిదా వేసుకోవాలని కోరారు.