మహబూబ్నగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వాగులు, వంకలు జలకళతో ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాలమూరు జిల్లాలోని చెక్డ్యాంలు కళకళలాడుతున్నాయి. కోయిల్సాగర్ నుంచి రామన్పాడు రిజర్వాయర్ వరకు పారే ఊకచెట్టు వాగు ప్రస్తుతం జలకళను సంతరించుకున్నది. ఊకచెట్టు వాగుపై రూ.68.28కోట్లు వెచ్చించి 12 చెక్డ్యాంల నిర్మాణాలు చేపట్టగా, 9 చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆదివారం చిన్నచింతకుంట మండలం ఏదులాపూర్- అప్పంపల్లి దగ్గర రూ. 9.67కోట్లతో నిర్మించిన చెక్డ్యాం ప్రారంభానికి ముం దే జలకళను సంతరించుకున్నది. దేవరకద్ర ఎమ్మెల్యే ఈ చెక్డ్యాంను ప్రారంభించారు. నీటిని చూసిన సంతోషంలో అక్కడే రైతులతో కలిసి భోజనం చేశారు. ఇప్పటికే పేరూరు, బస్వాపూర్, రేకులపల్లి, చిన్నరాజమూరు, పెద్దరాజమూరు, గురుకొండ, బండ్రవల్లి, లాల్కోట, పల్లమర్రి, కురుమూర్తి, అల్లీపూర్ చెక్డ్యాంలు నిర్మాణం పూర్తయి నీటితో కళకళలాడుతున్నాయి. కోయిల్సాగర్ నుంచి రామన్పాడు రిజర్వాయర్ వరకు ఈ వాగును సజీవంగా ఉంచాలని సీఎం కేసీఆర్ చెప్పారని.. ఈ మేరకు చెక్డ్యాంలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఆల వెల్లడించారు. అయితే, చెక్డ్యాంలవల్ల బోర్లు దంచికొడుతున్నాయి. చెక్డ్యాంల సమీపంలో సుమారు 3 చ.కి.మీ. పరిధిలోని బావులు, బోర్లు రీచానర్జ్ అయి పుష్కలంగా సాగునీటిని అందిస్తున్నాయి. ఒక్కో చెక్డ్యాం పరిధిలో సుమారు 500 ఎకరాల వరకు ఆయకట్టు సాగులోకి వస్తోందని నీటి పారుదల శాఖ డీఈ రాత్లావత్ చందు తెలిపారు.
రూ. 40లక్షల ఖర్చుతో 0.025టీఎంసీల నీటినిల్వ..
కోదాడ- బళ్లారి హైవే విస్తరణ తర్వాత బండర్వల్లి పాత బ్రిడ్జిని అలాగే వదిలేయకుండా కేవలం రూ.40లక్షల ఖర్చుతో చెక్డ్యాంలా మార్చేశారు. ప్రస్తుతం ఈ చెక్డ్యాం సుమారు 0.025 టీఎంసీ (25 ఎంసీఎఫ్టీ) నీటినిల్వతో కళకళలాడుతోంది. ఈ చెక్డ్యాంవల్ల 500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించినట్లు అయ్యింది. బావు లు, బోర్లు రీచార్జ్ అవుతున్నాయి. చెక్డ్యాం పరిధిలో ఏర్పాటు చేసిన ఫీడర్చానెల్తో 4 కి.మీ. వరకు సాగునీరు అందుతున్నది. ఇలాంటి చెక్డ్యాం నిర్మాణానికి సుమారు రూ.5కోట్లు ఖర్చవుతాయి. కానీ పాత బ్రిడ్జినే చెక్డ్యాంల మార్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం కలిగేలా చేశారు. సీసీకుంట మండలం అల్లీపూర్ చెక్డ్యాంవల్ల 650 ఎకరాలు ఆయకట్టు లభిస్తున్నది. 800 బోర్లు రీచార్జయ్యాయి. వర్షాకాలంలో పొంగి పొర్లే వాగు నీటిని వృ థా పోకుండా అడ్డుకునేందుకు ఉమ్మడి జిల్లాలో రూ. 332 కోట్లతో 64 చెక్డ్యాంలు నిర్మిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని ఊకచెట్టు, పెద్ద వాగుల్లో రూ.150కోట్లతో 21 చెక్డ్యాంలు నిర్మిస్తుండగా, ఇప్పటికే 19 నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో రెండింటి పనులు ముగింపు దశలో ఉన్నాయి.