కొల్లాపూర్ రూరల్, జూలై22: తొలకరి వానలు రాకతోపాటే ఎడతెగని ముసురు వర్షాలు కురుస్తుండటంతో వానకాలం సేద్యానికి రైతులు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే తొలకరికి మెట్ట ప్రాంతరైతులు కందులు, జొన్నలు వేసుకున్నారు. విత్తనాలు మొలకెత్తిన తర్వాత ముసురు వర్షాలు పడుతుండటంతో పైర్లకు చాలా మేలని రైతులంటున్నారు. రెండు రోజులుగా ముసురు పట్టడందో భూములు పదునెక్కుతున్నాయి. మాగాణి రైతులు తమ పొలాల్లో వరిమడులను సరిచూసుకుంటున్నారు. కరిగెట్లు చేసేందుకు ఈవర్షాలు బాగా ఉపకరిస్తాయంటున్నారు. బావుల కింద వరి పండించే రైతులకు ఈవర్షాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. రైతుబంధు డబ్బులు కూడా సమయానికి మంజూరు కావడంతో ఉత్సాహంతో సాగుకు సిద్ధమయ్యారు. యాసంగి పంటకాలానికి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వడంతో రైతులకు ఆర్థికంగా కొంత వెసులు బాటు కలిగింది.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
ముసురు వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే వేసుకున్న జొన్న, కంది ఇతర వాణిజ్య పంటలకు ఖరీదైన మందులు వేసుకోవద్దు. వర్షాలు లేనప్పుడే వాటిని వాడాలి. లేకుంటే వేసిన మందు వర్షపు నీటికి కొట్టుకుపోతుంది. మాగాణి రైతులు నారుమళ్లు వేసుకునేటప్పుడు యాజమాన్య పద్ధతులు పాటించాలి.