గద్వాల, ఆగస్టు 1 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాని కి పెద్దపీట వేసింది. విడుతల వారీగా దవాఖానలను అ భివృద్ధి చేస్తూ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నది. కరోనా సమయంలో రోగులకు ఆక్సిజన్ అందక నానా అవస్థలు పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయి తే, జిల్లా దవాఖానలో రెండో వేవ్ వరకు ఆక్సిజన్ కొరత లేకుండా దాతల సహకారంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆక్సిజన్ సిలిండర్లు దవాఖానకు ఇప్పించారు. జిల్లా కేంద్రంలోని దవాఖానలో 100 బెడ్ల వరకు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. సుమారు 150 బెడ్ల వరకు ఆక్సిజన్ అందించారు. దవాఖానలో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండడంతో హైదరాబాద్, మహబూబ్నగర్కు చెందిన కరోనా రోగులు కూడా గద్వాలకు వచ్చి వైద్యం తీసుకున్నారు. వైద్యుల, సిబ్బంది సేవలకు అనుగుణంగా ప్రభుత్వం, దాతల సహకారంతో స్థానిక ఎమ్మెల్యే సౌకర్యాలు సమకూర్చారు. త్వరలో థర్డ్ వేవ్ రానున్న నేపథ్యంలో జిల్లా దవాఖానలో ఆక్సిజన్ కొ రత లేకుండా చేయాలని ఎమ్మెల్యే సంకల్పించారు.
రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు..
ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో జిల్లా దవాఖానలో ప్రభుత్వ సహకారంతో ఒకటి, దాతల సహకారంతో మరో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. గత నెలలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జిల్లా దవాఖాన ఆవరణలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో సుమారు 100 బెడ్లకు ఆక్సిజన్ అందించే ప్లాంటును నిర్మిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్ రెడ్డీ స్ ల్యాబ్ సహకారంతో 250 బెడ్లకు ఆక్సిజన్ అందించే ప్లాంటుకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. గతంలో జిల్లా దవాఖానలోని రోగులకు ఆక్సిజన్ కావాలంటే జడ్చర్ల, క ర్నూల్కు వెళ్లి ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చేవారు. దీంతో వేలకు వేలు ఖర్చు కావడంతోపాటు సమయం వృథా అ య్యేది. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఒక్కోసారి సిలిండర్లు నింపేందుకు ఆక్సిజన్ లభించేది కాదు. దీంతో కరోనా రోగులు నానా అవస్థలు పడేవారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా నిరంతరం 350 బెడ్లకు ఆ క్సిజన్ అందించే అవకాశం ఉంటుంది. బెడ్లకు అవసరమై న పైపులైన్ పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కరోనా రోగులకు భరోసా లభించనున్నది.