కందనూలు, ఆగస్టు 1: ఓ వైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న తరుణంలో వానకాలం రావడంతో దోమల ప్రభావం కూడా పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు మరో పది రోజుల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు స్వీయరక్షణతోనే వ్యాధులు సోకకుండా తమను, తమ పిల్లలను కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
దోమల నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు:
ఉదయం, సాయంత్రం వేళల్లో..ఒక్క దోమ పదివేల దోమల్ని ఉత్పత్తి చేస్తుంది. వానకాలంలో ఉదయం, సాయంత్రం సమయాల్లో తలుపులు మూయాలి. ఈ సమయాల్లోనే దోమలు చురుకుగా పనిచేస్తాయి. దోమలు ఎక్కువ శాతం మురుగుకు ఆకర్షితమవుతాయి. పరిసరాల్లో మురుగు నిల్వ ఉండకుండా చూడాలి. నీటిగుంతలు, సంపులు, డ్రమ్ములు, నీటి ట్యాంకులపై మూతలు ఏర్పాటు చేసుకోవాలి. నీరు ఎక్కువ రోజలు నిల్వ ఉండకుండా చూడాలి. కూలర్లు, పాత టైర్లల్లో నిల్వ ఉండే నీటిని ఎప్పటికప్పుడు పారబోయాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీటని వాడకూడదు.
సబ్బు నీటితో దోమలు దూరం
సబ్బుతో కలిపిన నీటిని సాయంత్రం వేళల్లో దర్వాజాల ముందు విశాలమైన పాత్రల్లో ఉంచితే దోమలు ఆ నీటిలో చిక్కుకొని చచ్చిపోతాయి. దోమల నివారణకు సోడియం ల్యాంప్స్ కూడా వాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అదేవిధంగా మనం విడుదల చేసే కార్బన్డైఆక్సైడ్కు దోమలు ఆకర్షితమై నిద్రకు భంగం కల్గిస్తుంటాయి. నిద్రించే గదిలో ఓ మూలకు కొన్ని ఐస్క్యూబ్లను ఉంచితే అవి విడుదల చేసే కార్బన్డైఆక్సైడ్కు ప్రభావితమై అక్కడే ఉండి నిద్రకు భంగం కలిగించవు.
కృత్రిమ రసాయనాలు వాడొద్దు
దోమలు నివారణకు కృత్రిమంగా తయారు చేసే రసాయనాలను ప్రజలు ఎక్కువగా వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. గుడ్నైట్, ఆలౌట్, యాటీలు వంటి వాటిని వాడటం వల్ల శ్వాసకోస వ్యాధులు, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నది. కావునా సహజసిద్ధంగా తయారు చేసే వాటికి ప్రాధాన్యతనివ్వాలి. అదేవిధంగా పడుకునే సమయంలో దోమతెరలు వినియోగించడం వల్ల దోమల బెడద నుంచి విముక్తి పొందవచ్చు.