నాగర్కర్నూల్, జూలై 22: జిల్లాలో మూడు రోజులుగా మురుసువర్షం కురుస్తూనే ఉన్నది. ఇప్పటికే అత్యధికంగా కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల చెరువులు, కుంటలు నిండాయి. వ్యవసాయానికి అనువైన పదును లభించడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యా రు. జిల్లాలో అన్ని మండలాల్లోనూ బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా మురుసు వర్షం కురుస్తోంది. చల్లటి గాలులు వీస్తూ కురుస్తున్న వర్షం కారణంగా పట్టణంలో చాలా వరకు వ్యాపార సంస్థలు మూసి ఉంచారు.
జిల్లాలో వర్షపాతం వివరాలిలా ..
జిల్లాలోని మూడు వ్యవసాయ డివిజన్లలో (నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట) అత్యధికంగా నాగర్కర్నూల్లో 26.2 మి.మీ, అచ్చంపేట డివిజన్లో 20.2 మి.మీ, కల్వకుర్తి డివిజన్లో 30.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. నా గర్కర్నూల్ డివిజన్లోని తొమ్మిది మండలాల్లో పెంట్లవెల్లి లో 50.3 మి.మీ, అత్యల్పంగా కోడేరులో 25.4 మి.మీ, కల్వకుర్తి డివిజన్లోని ఐదు మండలాల్లో అత్యధికంగా క ల్వకుర్తిలో 19.8 మి.మీ, అత్యల్పంగా వంగూరు మండలంలో 17.6 మి.మీ, అచ్చంపేట డివిజన్లోని ఆరు మం డలాల్లో అత్యధికంగా బల్మూర్ మండలంలో 24 మి. మీ, అత్యల్పంగా పదరలో 14.5మి.మీ వర్షపాతం నమోదైంది.
చారకొండలో మోస్తరు వర్షం
మండలంలోని చారకొండ, జూపల్లి, తిమ్మాయిపల్లి, తుర్కలపల్లి, సిరుసనగండ్ల గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి మోస్తరు వర్షం కురిసింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిండిన కుంటలు, చెరువులు
మండలంలోని ఆయా గ్రామాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి కుంటలు, చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. కాగా కొన్ని చోట్ల యువకులు నీరు పారే ప్రదేశాల్లో చేపల వేట కొనసాగిస్తున్నారు. మండలంలోని పాలెం పెంటోనిచెరువు అలుగు పారుతున్నది. నల్లవాగు ప్రవహిస్తుండడంతో యువత చేపలు పడుతూ ఆనందంగా గడిపారు.
దుందుభీకి జలకళ
నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో దుందుభీ ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో జలకళను సంతరించుకుంది. కల్వకుర్తి మండలం రఘుపతిపేట అనుబంధ గ్రామం రామగిరి వద్ద కల్వకుర్తి- తెల్కపల్లి ప్రధాన రహదారిపై దుందుభీ పొంగిపొర్లుతుండడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుందుభీలో జలకళ.. రైతన్నల పంటల కళ కళ అని అంటున్నారు. నీరు బాగా ప్రవహిస్తుండడంతో అటువైపుగా వెళ్లే బాటసారులు సెల్ఫీలు దిగుతుండగా మరికొంత మంది యువకులు చేపల వేటను కొనసాగిస్తున్నారు. దుందుభీ ప్రవహించడంతో అటు రైతులకు ఇటు మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు.