ఆత్మకూరు, జూలై 16 : ఉమ్మడి జిల్లా కల్పతరువు అయిన జూరాల రిజర్వాయర్కు జలకళ వచ్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నారాయణపూర్ నుంచి విడుదలవుతున్న నీరు ఏకధాటిగా జూరాలకు చేరుకుంటున్నది. శుక్రవారం ఉదయం 18వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, మధ్యాహ్నం 3 గంటల వరకే 60 వేల క్యూసెక్కులకు చేరింది. కేవలం 9 గంటల్లో దాదాపు 40 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో పెరిగింది.దీంతో ఎత్తిపోతల ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నారుమళ్లు సిద్ధం చేసుకొని నాట్లు వేస్తున్న క్రమంలో జలాశయానికి వరదనీరు రావడం అన్నదాతలకు ఆనందం కలిగిస్తున్నది. జూలై 2వ తేదీ వరకు జలాశయంలో ఉన్న నీటితో సాధ్యమైనంతగా విద్యుదుత్పత్తికి వినియోగించుకున్న పరిస్థితుల్లో.. ప్రస్తుతం వస్తున్న వరదతో జలాశయం పూర్తిస్థాయిలో నింపేందుకు అధికారులు యోచిస్తున్నారు. వరద నీటి లభ్యతను బ ట్టి భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్లకు ఎత్తిపోయడంతోపాటు కుడి, ఎడవ కాలువలు, భీమా 2, సమాంతర కాలువల కు నీటిని విడుదల చేయనున్నారు. నిర్దేశించిన స్థా యిని మించి వరద ఉగ్రరూపం దాలిస్తే రేపో, మాపో గేట్లు ఎత్తే అవకా శం ఉన్నట్లు తెలుస్తున్నది.
క్రమంగా పెరుగుదల..
శుక్రవారం ఉదయం 6 గంటలకు 18,774 క్యూసెక్కులతో ఇన్ఫ్లో ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకే 47,700 క్యూసెక్కులకు చేరింది. కేవలం మూడు గంటల్లో దాదాపు 30 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు 52,200 క్యూసెక్కులకు పెరుగగా, 3 గం టల వరకు 59,300 క్యూసెక్కులకు చేరుకున్నది. సాయంత్రం 6 గంటల వరకు 63,400 క్యూసెక్కులతో వరద క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, సాయంత్రం వరకు 7.316 టీఎంసీలకు చేరుకున్నది. కుడి కాలువకు 200, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేశారు. 34,651 క్యూసెక్కులతో ఎగువ జూరాలలో ఐదు యూనిట్లు, దిగువ జూరాలలో ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఇదే వరద కొనసాగితే త్వరలోనే ఆరో యూనిట్ వినియోగంలోకి తీసుకురానున్నట్లు ఎస్ఈ జయరాం తెలిపారు. మొత్తం 35,040 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లోగా నమోదైంది.
తుంగభద్ర డ్యాంకు వరద
అయిజ, జూలై 16 : కర్ణాటకలోని తుంగ, భద్ర పరీవాహ క ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వానలకు టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది. శుక్రవారం డ్యాంకు ఇన్ఫ్లో 17,327 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 291 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు, నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1610.86 అడుగుల్లో 36.916 టీఎంసీలు నిల్వ ఉన్నాయని డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువ నుంచి 648 క్యూసెక్కుల వరద వస్తుండగా కన్స్ట్రక్షన్ స్లూయిస్, స్కవ ర్ స్లూయిస్ గేట్ల ద్వారా సుంకేసుల బ్యారేజీకి 867 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు కర్ణాటక జేఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో నీటినిల్వ 4 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు.