కొల్లాపూర్, సెప్టెంబర్ 24: మండలంలోని సింగవట్నం-గోపల్దిన్నె రిజర్వాయర్ గ్రావిటీ కెనాల్ తవ్వకాల పనులకు మహర్దశ పట్టనున్నది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి, వీపనగండ్ల మండలాల రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. వీపనగండ్ల మండలం గోపల్దిన్నె రిజర్వాయర్ దిగువన జూరాల ఎడమ కాల్వ కింద 26వేలు, భీమా కింద 9వేల ఎకరాల చివరి ఆయకట్టు, భీమా మొత్తం కలిపి సుమారు 35వేల ఎకరాలకు సక్రమంగా సాగునీరందక ప్రతి సీజన్లో రైతులు సాగునీటికి కష్టాలు పడుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గానూ ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా కొల్లాపూర్ మండలంలోని సింగవట్నం శ్రీవారిసముద్రం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా కృష్ణానది నీటిని గోపల్దిన్నె రిజర్వాయర్కు నీటిని అందించే పనులకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. చిన్నంబావి, వీపనగండ్ల మండలాల రైతులు సాగునీటికి పడుతున్న కష్టాలను వివరించారు. దీంతో నీటిపారుదలశాఖ అధికారులు రూ.147కోట్లతో ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు రూ.147కోట్ల అంచనా వ్యయంతో చేసిన నీటిపారుదలశాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే రెండురోజుల కిందట గ్రావిటీ కెనాల్ తవ్వకాల పనులకు హైదరాబాద్ ఎర్రమంజిల్లోని నీటిపారుదలశాఖ ప్రధాన కార్యాలయంలో టెండర్లు జరిగాయి.
ఈ టెండర్లలో రెండు కంపెనీలు పాల్గొనగా.. ఇందులో ఓ కంపెనీకి
అనర్హత ఉండడంతో తిరస్కరణకు గురైంది. దీంతో రూ.122కోట్లకు మెగా కంపెనీ పనులను దక్కించుకున్నట్లు నీటిపారుదలశాఖ అధికారుల ద్వారా తెలిసింది. కొల్లాపూర్ మండలం సింగవట్నం శ్రీవారిసముద్రం రిజర్వాయర్ నుంచి 23కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ ద్వారా గోపల్దిన్నె రిజర్వాయర్కు నదీనీరు అందనున్నది. దీంతో గోపల్దిన్నె దిగువ ఆయకట్టుతోపాటు జూరాల ఎడుమ కాల్వ పరిధిలోని చిన్నంబావి, వీపనగండ్ల మండలాల చివరి ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలు గట్టెక్కనున్నాయి.
35వేల ఎకరాలకు సాగునీరు
చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో 35వేల ఎకరాలకు సాగునీరందనున్నది. ఏటా తాము పడుతున్న సాగునీటి కష్టాలను చూసి చలించిపోయినా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి సాధించారు. చిరకాల వాంఛగా ఉన్న తమ సమస్యను సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టి పూర్తి చేయించాలని ఆయా మండలాల రైతులు మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిని కోరుతున్నారు. చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరందించేందుకు సింగవట్నం నుంచి గోపల్దిన్నె రిజర్వాయర్కు గ్రావిటీ కెనాల్ తవ్వకాల పనులకు టెండర్లు పూర్తిచేయించినందుకు చిన్నంబావి, వీపనగండ్ల మండలాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికి ఆయా మండలాల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.