మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి), జూలై 11 : వెనకబడిన పాలమూరు జిల్లా అని, వలసల జిల్లా అనే దశ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు పాలమూరు సైతం అన్నింటా ముందు వరుసలో ఉంటున్నది. వలసలు వెళ్లిన వారంతా తిరిగొచ్చి స్థానికంగా ఉపాధి పొందే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్ని రంగాల్లోనూ మేము సైతం అంటూ పాలమూరు దూసుకెళ్తున్నది. మరో అంశంలోనూ పాలమూరు తన ప్రత్యేకతను చాటుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా గతేడాది కోటి విత్తన బంతులు తయారు చేసి వాటిని విజయవంతంగా కొండకోనల్లో వెదజల్లి రికార్డు సృష్టించిన పాలమూరు మహిళా సంఘాల సభ్యులు ఈ ఏడాది ఏకంగా రెండు కోట్లకు పైగా సీడ్బాల్స్ తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. వెదజల్లేందుకు సిద్ధం చేసి ఉంచిన 2.08కోట్ల విత్తన బంతులను సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, గ్రీన్ చాలెంజ్ రూపకర్త, ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్ ప్రారంభించనున్నారు. రెండు కోట్ల సీడ్బాల్స్ వెదజల్లి గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జిల్లా మహిళా సమాఖ్య గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకున్నది.
పాలమూరు ప్రత్యేకం
రెండు కోట్ల విత్తన బంతులు తయారు చేసేందుకు మహబూబ్నగర్ జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు సుమారు లక్షమంది 10 రోజులపాటు కష్టపడ్డారు. ఒక్కరు కూడా పైసా కూలి తీసుకోలేదు. పచ్చని పాలమూరు కోసం అందరూ ఉచితంగా పనిచేశారు. మేము సైతం పాలమూరు పచ్చదనం కోసం అంటూ అతివలు నడుంబిగించారు. కేవలం పదంటే పది రోజుల్లో రెండు కోట్ల విత్తన బంతులను తయారు చేసి గతేడాది నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశారు. సెర్ప్ ఆధ్వర్యంలో 1.70 కోట్లు, మెప్మా ద్వారా 30లక్షల సీడ్బాల్స్ సిద్ధం చేశారు. గత నెల 15నుంచి 10రోజుల పాటు మహిళా సంఘాల ఆధ్వర్యంలో 2.08కోట్ల విత్తన బంతులను తయారు చేశారు. ఆ విత్తన బంతులను స్థానికంగానే అడవులు, కొండల్లో, మనుషులు చేరుకోలేని ప్రదేశాల్లో వెదజల్లేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం డ్రోన్లను వినియోగించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కొన్నిచోట్ల ఎత్తైన కొండలపైకి ఎక్కి మనుషులు సైతం విత్తన బంతులను వెదజల్లనున్నారు. నేటి నుంచి వారం రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో విత్తన బంతులను వెదజల్లుతారు. హరితహారంలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావు ప్రత్యేక దృష్టి సారించారు. 2కోట్ల విత్తన బంతులను విజయవంతంగా వెదజల్లి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం పాలమూరు మహిళలు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా లైవ్ కవరేజీ ఇవ్వనున్నారు.