నాగర్కర్నూల్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : పేదలకు పస్తులు, అర్థ్ధాకలి బాధలు తీరనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశంతో సివిల్ సైప్లె అధికారులు అర్హులందరికీ రేషన్ బియ్యం అందించే ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నది. ఏండ్ల తరబడిగా ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి ప్రజల ఆశలు నెరవేరనున్నాయి. ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల నుంచి అధికారులు అర్హులను గుర్తించే ప్రక్రియ చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సివిల్ సైప్లె శాఖాధికారులకు నివేదిక ఇచ్చారు. దాదాపుగా ఈ కార్యాచరణ పూర్తి కావచ్చింది. ఈ నివేదికలను అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. వ్యవసాయ, రవాణా, ఆదాయపన్ను శాఖల సమాచారం మేరకు అర్హులను ఎంపిక చేయడం గమనా ర్హం. ఏడు ఎకరాలకంటే ఎక్కువ భూమి, నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండడంతో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. కొ న్నేండ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ పేదలందరి ఆకాంక్షలు ఈనెల 26వ తేదీతో తీరనున్నాయి. కార్డులు పొందిన లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం పంపిణీ చేపట్టనుండ డం విశేషం. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నది. విద్యార్థులకు స్కాలర్ షిప్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు, ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్య శ్రీ చికిత్సకు, ఎస్సీ, ఎస్టీ, బీ సీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు.. ఇలా పలు పథకాల్లో లబ్ధిపొందేందుకు రేషన్ కార్డులు తప్పనిసరిగా అవసరమవుతున్నాయి.
కొన్నేండ్లుగా రేషన్ కార్డులు లేక పేదలు ప లు పథకాల్లో లబ్ధి పొందేందుకు ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్యలన్నీ కొత్తగా మంజూరు చేస్తున్న రేషన్ కార్డులతో తీరిపోనున్నాయి. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లో 558 రేషన్షాపులు ఉండగా.. 2,37,268 ఆహార భద్రత, 18,691అంత్యోదయ, 40 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి.తాజాగా జిల్లాలో 5,528 మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల మేరకు 620 తిరస్కరించగా.. 4,908 మందిని అర్హులుగా గుర్తించారు. కార్డులు మంజూరయ్యే వరకు దరఖాస్తుల సంఖ్యలో మార్పు జరగొచ్చు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జారీ..
ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇచ్చిన విచారణ మేరకు జిల్లాలో 4,908 మందిని అర్హులుగా గుర్తించాం. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే కార్డులు, బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం.