మహబూబ్నగర్, ఏప్రిల్ 28: ఆర్వోఆర్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు నిర్వహించిన ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా జారీ చేసిన హైకోర్టు ఉత్తర్వులననుసరించి పునర్ వ్యాజ్యానికి అవకాశం కల్పించినట్లు కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. ట్రిబ్యూనల్ కేసులపై ఈ నెల 15,24న వెబ్నార్ నిర్వహించడంతోపాటు బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మరోసారి వెబ్నార్ నిర్వహించారు. ఈ నెల 24న 30కేసులు, బుధవారం 39 కేసులపై పునర్ వ్యాజ్యాన్ని విన్నట్లు కలెక్టర్ తెలిపారు. మళ్లీ మే 1న వెబ్నార్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వెబ్నార్లో అదనపు కలెక్టర్ సీతారామారావు, న్యాయవాదులు, తదితరులు ఉన్నారు.
అధిక లాభాలు వచ్చే పంటలను పండించాలి
లాభాలు వచ్చే పంటలను పండించేందుకు రైతులకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీలో వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. వరి సాగు విషయంలో రైతులు అధికంగా ఎరువులు వాడటం ద్వారా భూమి సాంద్రత కోల్పోతుందని, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా ఎంతో మేలు ఉంటుందని పేర్కొన్నారు. వందశాతం సబ్సిడీపై కల్లాలను ఏర్పాటు చేసేందుకు ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హెచ్టీ పత్తిని సాగు చేయొద్దని ఈ విత్తనాలను ఎవరూ విక్రయించకూడదని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి హుక్యానాయక్, వివిధ కంపెనీల ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.