కొల్లాపూర్, జూలై22: కొల్లాపూర్ మండలంలో జోరుగా ముసురువర్షం కురిసింది. మండల వ్యాప్తంగా 40.8మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు మండల గణాంకాధికారి విశ్వేశ్వర్ గురువారం తెలిపారు. మండలానికి ఎగువన ఉన్న నల్లమల అడవి కొండల్లో భారీ వర్షం కురవడంతో దిగువన ముక్కిడిగుండం- నార్లాపూర్ మధ్య ఎర్రగట్టు పెద్దవాగు పొంగి ప్రవహిస్తున్నది. దీంతో గురువారం మధ్యాహ్నం వరకు ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. నార్లాపూర్ సమీపంలో ఎర్రగట్టు వద్ద వర్షానికి బీటీ రోడ్డు కోతకు గురైయింది. ముక్కిడిగుండం గ్రామానికి తూర్పు దిశలో ఉన్న ఉడుములవాగుకు పెద్దగా వరద అంతగాలేదు. కొల్లాపూర్ పట్టణం సమీపంలో ఉన్న మూలవాగు, రామాపూర్, ఎన్మన్బెట్ల వాగులు వంతెనల కింద పొంగిపొర్లాయి.
వాగులను దాటొద్దు: ఎస్సై
మండలంలోని నల్లమల అటవీతీర గ్రామా ల్లో ప్రమాద స్థాయిలో పొంగిప్రవహించే వాగులను దాటొద్దని కొల్లాపూర్ ఎస్సై రమణాయాదవ్ హెచ్చరించారు. గురువారం ఎస్సై తమ సిబ్బందితో కలిసి నార్లాపూర్ ఎర్రగట్టు పెద్దవాగు, ముక్కిడిగుండం ఉడుముల వాగులను పరిశీలించారు. వాగులు ప్రమాదస్థాయిలో పొంగితే తమకు సమాచారం ఇవ్వాలని వాగు వద్ద సిబ్బందిని ఉంచుతామని చెప్పారు.
అలుగు పారుతున్న చీకటి చెరువు
అచ్చంపేట, జూలై22: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, వాగుల్లో వర్షపు నీరు పారుతున్నది. నల్లమలలో వరుసగా పదిరోజులుగా ముసురు వర్షం కురుస్తుంది. అచ్చంపేట మండలంలోని చౌటపల్లి వాగు పారుతున్నది.లింగాల మండలం చీకటి చెరువు అలుగెల్లింది. ఉప్పునుంతల మండలంలోని దుందుభి పరవళ్లు తొక్కుతున్నది. దుందుభి వాగు నుంచి రాకపోకలు సాగించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.