మహబూబ్నగర్, జూలై 18: నివాసముంటున్న ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే చుట్టుపక్కల రోడ్డు విస్తరణ రాకపోకలకు సులువుగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రేమ్నగర్లోని గీతాహోటల్ లైన్లో రోడ్డు విస్తరణకు సంబంధించిన పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు విస్తరణకు ప్రతిఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందరం కలిసికట్టుగా ఉంటూ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కిశోర్, మాజీ కౌన్సిలర్ గంజివెంకన్న తదితరులు ఉన్నారు.
వ్యక్తిగత ఇన్సూరెన్స్ ముఖ్యం
ప్రతివ్యక్తికీ ఇన్సూరెన్స్ ఎంతో ముఖ్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా ఆధ్వర్యంలో సమకూర్చిన యాక్సిడెంటల్ పాలసీ కార్డులను కరాటే మాస్టర్లకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కరాటే వ్యక్తిగత రక్షణకు ఎంతో ఉపయోపడుతుందని తెలిపారు. తమతోపాటు మరో పది మందిని రక్షణ కవచంలా కరాటే నేర్చుకున్న వారు ఉంటారని తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్, అతికూర్హ్మ్రన్ కరాటే మాస్టర్లు, తదితరులు ఉన్నారు.
ఆలోచింపజేసిన సురవరం నాటక ప్రదర్శన
తెలంగాణ వైతాళికులు, సంఘసంస్కర్త, గోల్కొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాప్రెడ్డి నాటక ప్రదర్శను జిల్లా కేంద్రంలోని టౌన్హాల్లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై నాటకప్రదర్శనను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ నాటక ప్రదర్శన నుంచే నేటి సినిమా ప్రపంచం ఆవిష్కృతం అయిందని తెలిపారు. గ్రామాల్లో నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయంటే ఆ గ్రామంలో ఎంతో కోలాహలంగా ఉండేందని తెలియజేశారు. సురవరం ప్రతాప్రెడ్డి తెలంగాణకు చేసిన మేలును నాటక ప్రదర్శన ద్వారా ప్రజలకు వివరించేందుకు చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాటకంలోని ప్రతి పాత్ర ఎంతో అకట్టుకుందని పేర్కొన్నారు. వర్షం పడుతున్న నాటక ప్రదర్శనను తిలకించేందుకు ప్రజలు అధికంగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సురవరం ప్రతాప్రెడ్డి ఆశయసాధన కోసం అందరం కలిసి ముందుకు సాగుదామని తెలియజేశారు. మంచి చేసేవారికి మరింత తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆనాటి నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల సంక్షేమమే తమ ధ్యేయం అంటూ ముందుకు సాగారని గుర్తు చేశారు. మంచి చేసిన మహనీయులను అందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సంగీత నాటక ప్రదర్శన రాష్ట్ర చైర్మన్ బాద్మి శివకుమార్,జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు బీఎం రెడ్డి, కౌన్సిలర్ గోవింద్, సురవరం ప్రతాప్రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.