కేసముద్రం : గ్రామాల అభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండలంలోని రంగాపురం గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమవేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, రైతుబీమా, రైతుబంధు, రుణ మాఫీ, ఆసరా, అమ్మ ఒడి, 24 గంటల విద్యుత్ సరఫరా, దళిత బంధు వంటి పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు.ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న విపక్షాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కల్యాణలక్ష్మి, రైతుబీమావంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తమ ఉనికి కోసం కొన్ని ఆ పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. నోరు అదుపులో పెట్టుకోకపొతే టీఆర్ఎస్ కార్యకర్తలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ వేసి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తానన్నారు. రంగాపురం నుంచి రాజీవ్నగర్ తండా వరకు బీటీ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. చెరువుకు గోదావరి జలాలు వచ్చే విధంగా ఎస్సారెస్పీ కాలువకు పాయింట్ పెట్టిస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలో సీసీ రోడ్లు వేయడానికి ఎంపీటీసీకి రూ.10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులను, బాలింతలను సన్మానించారు. చిన్న పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్, మార్క్ఫెడ్ డైరెక్టర్ మరి రంగారావు, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి , మార్కెట్ చైర్మన్ మరి నారాయణరావు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, సర్పంచ్ భూక్యా రాములు, ఎంపీటీసీ పార్వతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నజీర్ అహ్మద్, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ దామరకొండ ప్రవీణ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఊకంటి యాకుబ్రెడ్డి, రావుల రవిచందర్రెడ్డి, కముటం శ్రీను, సట్ల వెంకన్న, బొబ్బిలి మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.