మహబూబాబాద్ : మహబూబాబాద్లో త్వరలో టీ- డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో కొవిడ్ మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం హాస్పిటల్లో కోవిడ్ రోగుల కోసం ఏర్పాటుచేసిన వసతులు, చికిత్సకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ గౌతమ్, జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల కొంతమందికి ఉన్న అనుమానం తొలగించడం కోసం ఇక్కడ వ్యాక్సిన్ తీసుకొని కొంత ధైర్యం కల్పిద్దాం అని అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే వ్యాక్సిన్ కు అద్భుతమైన స్పందన ఉందన్నారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇక్కడ రోగుల పరీక్షలలో సౌకర్యం కోసం టి – డయాగ్నస్టిక్ హబ్ ను ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు.
అలాగే మే 5, 6 తేదీల్లో మహబూబాబాద్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ల కేంద్రాన్ని కూడా ప్రారంభించబోతున్నామని వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు చేయించుకున్న తర్వాత వరంగల్ వెళ్లి రావాల్సి వస్తున్నది.
దీనివల్ల పరీక్షల ఫలితాల్లో జాప్యం జరుగుతోంది. కావున మహబూబాబాద్ లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కేంద్రాన్ని ఇవ్వమని సీఎం కేసీఆర్ను కోరినప్పుడు వెంటనే అంగీకరించి మంజూరు చేశారు. అందుకు వారికి ధన్యవాదాలన్నారు.
ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ప్రజలు కూడా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మహమ్మారిన తరిమి వేయాలని పిలుపునిచ్చారు. మంత్రితో పాటు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, స్థానిక అధికారులు, నేతలు ఉన్నారు.